హైదరాబాద్ : దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రం తీసుకొచ్చిన గాంధీజీని స్మరించుకోవాల్సిన బాధ్యత మన పై ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1951 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి ఎంతో చరిత్ర ఉన్నదని, ఈ రహదారికి కూడా MG రోడ్ గా నామకరణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భావితరాలకు స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అందులో భాగంగానే ఇక్కడి గాంధీ విగ్రహం పరిసరాలను ఆహ్లాదకరంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పనులు వేగంగా సాగుతున్నాయని, అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, ఎలెక్ట్రికల్ డీఈ శ్రీధర్, హార్టికల్చర్ అధికారి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.