సిటీబ్యూరో, జూన్ 3(నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ట్విట్టర్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది. కూకట్పల్లి జోన్ పరిధిలోని గాజులరామారం, బంధంకుంట, పెద్దచెరువు, కొత్త కుంట, రామన్ చెరువు లేక్, బంజారాహిల్స్లోని బంజారా లేక్తోపాటు గాజులరామారం ఆక్సిజన్ పార్క్ను మేయర్ పరిశీలించారు. బంధంకుంట వద్ద చెత్తను చూసిన మేయర్ వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. పెద్దచెరువు వద్ద వాకింగ్ ట్రాక్తో పాటు బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయాలని సూచించారు. బాలాజీ లేఅవుట్, వోక్షిత్ లే అవుట్ ఏరియాలను పరిశీలించిన మేయర్ డ్రైనేజీ పైపులైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. బంజారాలేక్ వద్ద క్లీనింగ్ పనులు పూర్తిచేసి వాకింగ్ ట్రాక్ను నిర్మించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్లు మమత, ప్రావీణ్య, కార్పొరేటర్ రావుల శేషగిరి తదితరులు పాల్గొన్నారు.