Gaddam Srinivas Yadav | అబిడ్స్, మార్చి 25 : హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్యాదవ్ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ టికెట్ను ఆశించిన గడ్డం శ్రీనివాస్ యాదవ్కు టికెట్ లభించకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంపిక చేశారు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, పార్టీ ప్రధాన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గం పేరు : హైదరాబాద్ పార్లమెంట్
పేరు : గడ్డం శ్రీనివాస్ యాదవ్
వయస్సు : 56 సంవత్సరాలు
విద్యార్హతలు : బీకాం
కుటుంబ నేపథ్యం : భార్య స్వర్ణలత యాదవ్, కూతురు డాక్టర్ గడ్డం స్నేహ యాదవ్, కుమారుడు న్యాయవాది గడ్డం గగన్ యాదవ్.
వృత్తి : విద్యా సంస్థల నిర్వాహణ, జంట నగరాల్లోని 17 హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజీలకు చైర్మన్, శ్రీ హిందూ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్
రాజకీయ నేపథ్యం: ప్రస్తుతం గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు. 1989లో విద్యార్థి జీవితం నుంచి ఆయన రాజకీయాలకు ఆకర్శితుడై ఎన్ఎస్యూఐలో చేరారు. ఎన్ఎస్యూఐ నగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆలిండియా కార్యదర్శిగా కొనసాగారు. క్యాంపస్ ఇన్చార్జిగా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆలిండియా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా కొనసాగారు. 2006 సంవత్సరంలో నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులై 2011 సంవత్సరం వరకు కొనసాగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన తన తండ్రి గడ్డం గంగాధర్ యాదవ్ పేరిట ఫౌండేషన్ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. కరోనా సమయంలో వేలాది కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ పట్టారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్తీలలో బస్తీ బాట చేపట్టి ఆయా ప్రాంతాలలో ఆర్థిక సమస్యలతో చదువుకోలేని విద్యార్థిని, విద్యార్థులను గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకున్నారు. గత విద్యా సంవత్సరంలో ఉచితంగా విద్యా బోధన చేసేందుకు గాను తన కళాశాలలలో అవకాశం కల్పించారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా ఆయా బస్తీలలోని ప్రజల సమస్యలను తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి పాటు పడ్డారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇంటింటా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిపి వారి సహకారంతో విజయం సాధిస్తానని అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక పోతున్నదని, దీంతో ప్రజలు తిరిగి బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను చేపట్టారని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రజల మద్దతుతో ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.