వెంగళరావునగర్, సెప్టెంబర్ 3 : రాంగ్రూట్లో వస్తున్న ద్విచక్ర వాహనదారుడిని ఆపిన ట్రాఫిక్ పోలీసు.. వాహనం కీస్ లాక్కున్నాడు. ఆవేశానికి లోనైన వాహనదారుడు కోపంతో తన బైక్కు నిప్పంటించి తగులబెట్టాడు. ఈ ఘటన సోమవారం అమీర్పేట మైత్రీవనం కూడలిలో జరిగింది. ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ నివాసి అశోక్ అమీర్పేట మైత్రీవనం సమీపంలోని అన్నపూర్ణ బ్లాక్లో రాయల్ మొబైల్స్ షాపును నిర్వహిస్తున్నాడు. ఇంటి నుంచి తన ద్విచక్ర వాహనంపై బయలుదేరి అమీర్పేట చౌరస్తా మీదుగా వచ్చాడు.
అమీర్పేట మెట్రో స్టేషన్ కింద యూ టర్న్ తీసుకుని ఎదురుగా కనిపించే అన్నపూర్ణ బ్లాక్లోని తాను నిర్వహిస్తున్న మొబైల్స్ దుకాణానికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ హోంగార్డు అస్ఘర్ వాహనదారుడిని ఆపి.. రాంగ్ రూట్లో ఎందుకువస్తున్నావంటూ ప్రశ్నించాడు. ఎదురుగానే తన దుకాణం ఉన్నదంటూ వాగ్వావాదానికి దిగాడు. దీంతో హోంగార్డు అస్ఘర్ వాహనం కీస్ లాక్కున్నాడు. ఆగ్రహించిన అశోక్ అన్నపూర్ణ బ్లాక్లోని తన దుకాణానికి వెళ్లి సీసాలో పెట్రోలు తీసుకుని వచ్చి తన బైక్పై పెట్రోలు చల్లి నిప్పుపెట్టాడు. దీంతో ఒక్కసారిగా బైక్ పూర్తిగా కాలిపోయింది. స్థానికులు మంటలర్పేందుకు ప్రయత్నించారు. హోంగార్డు అందించిన సమాచారంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు అశోక్ను అదుపులోకి తీసుకుని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్కు తరలించారు. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు అశోక్పై కేసు నమోదు చేస్తామని ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.
బైక్ దహనం.. స్పందించిన ట్రాఫిక్ జాయింట్ సీపీ
బైక్ దహనం ఘటనపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ ఎ.వి.రంగనాథ్ స్పందించారు. వాహనదారుడు అశోక్ రాంగ్ రూట్లో రావడంతో అక్కడ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ హోంగార్డు బైక్ను ఆపారని పేర్కొన్నారు. రాంగ్ రూట్లో వాహనం నడపడంతో అతడితో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదమని తెలిపారు. ప్రజల భద్రత కోసమే ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు.