సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తాజా కూరగాయల కొనుగోలులో వారాంతపు సంతలకు ఆదరణ లభిస్తున్నది. మార్కెట్లు, ఆన్లైన్, కిరాణా దుకాణాల్లో కాదని ఎక్కువ మంది వినియోగదారులు వారాంతపు సంతకు క్రేజీ కనబర్చుతున్నట్లు లోకల్ సర్కిల్ సర్వేలో తేలింది. కూరగాయలు, పండ్లు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారన్న అంశంపై దేశవ్యాప్తంగా 297 జిల్లాల్లో 24వేల మంది వినియోగదారుల నుంచి సర్వే జరిపారు. 61శాతం మంది పురుషులు, 39శాతం మంది మహిళల నుంచి వివరాలను సేకరించారు. ఇందులో 66 శాతం మంది వారాంతపు మార్కెట్లకు వచ్చి తాజా పండ్లు, కూరగాయలను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు.
7శాతం మంది మాత్రమే ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నామని, 21శాతం మార్కెట్లలో, 3శాతం తోపుడు బండ్లు, 5 శాతం రిటైల్ దుకాణాల ద్వారా కూరగాయలు కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఆన్లైన్ కొనుగోలులో ఉత్పత్తి తక్కువ నాణ్యత, అధిక ధరలు వంటి కారణాలుగా వినియోగదారులు పేర్కొన్నారు. కార్మికులు, దినసరి కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు, భవన నిర్మాణరంగ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు అవసరమైన కూరగాయలు, పండ్లు, పలు రకాల ఆకుకూరలు, ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులను వారాంతపు సంతలో కోనుగోలు చేయడానికి ఎకువగా మొగ్గు చూపుతున్నారు. వినియోగదారుల నుంచి డిమాండ్ ఉండడంతో నగరంలో చాలా చోట్ల ప్రాంతాల వారీగా వారంలో ఏడు రోజులు సంతలు నడుస్తున్నాయి. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు సంత సాగుతుంది. ఇంటి దగ్గర సంతలోనే అన్నీ దొరకడంతో వారాంతపు సంతలను ఇష్టపడుతున్నట్లు తెలిపారు. సమయం, డబ్బు కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు.