రంజాన్మాసంలో రోజా పాటించే ముస్లింల కోసం..
ఎల్లారెడ్డిగూడ మసీదు ఆవరణలో ఏర్పాటు
సేవా గుణాన్ని చాటుకుంటున్న సోదరులు
13 ఏండ్ల నుంచి నిర్విఘ్నంగా కొనసాగింపు
వెంగళరావునగర్, ఏప్రిల్ 30: రంజాన్ మాసంలో ముస్లింలకు ఉపవాసదీక్షలు చాలా కీలకం. రాత్రి చేసే ఇఫ్తార్కు ఇబ్బందులు లేకున్నా..తెల్లవారుజామున 4.45లోపు చేసే సహర్కు సమయం చాలా తక్కువగా ఉంటుంది. తెల్లవారుజాము 3గంటలకు నిద్రలేస్తేగానీ సహర్కు సంసిద్ధులు కాలేరు. ఈ ఇబ్బందులను గుర్తించిన ముస్లిం సోదరులు రంజాన్ మాసం ప్రతి రోజు సహర్ ఉచితంగా ఏర్పాటు చేసి తమ సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనా… ఈ మహత్కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.
ఎల్లారెడ్డిగూడకు చెందిన టీఆర్ఎస్ పార్టీ శ్రీనగర్కాలనీ డివిజన్ అధ్యక్షుడు అప్పూఖాన్, అతని అన్నయ్య తన్నూఖాన్ 13 ఏండ్లుగా రంజాన్ నెలంతా సహెర్ విందులను ఏర్పాటు చేస్తున్నారు. సహర్కు అవసరమైన భోజన సామగ్రిని సిద్ధం చేసుకుని రాత్రంతా వంటలు చేస్తారు. రోజుకో మెనూ ప్రకారంగా మటన్ కర్రీ, చికెన్ కర్రీ, వైట్ రైస్, బగారా రైస్, పలావు, బిర్యానీ, దాల్చా వంటి వంటకాలను సిద్ధం చేస్తారు. ఎల్లారెడ్డిగూడ ఇమాంగూడ హుసేనీ మసీదు ఆవరణలో రోజా పాటించేవారి కోసం తెల్లవారుజామున ఈ సహర్ విందులను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. ఉపవాస దీక్షలో ఉన్న మహిళలు, వికలాంగులు, వృద్ధులకు ఉచితంగా పార్సిళ్లు కూడా పంపిస్తున్నారు. ఈ సహర్ విందుకు హాజరై వీరి సేవానిరతిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అభినందించారు.
ఉపవాసాలకు ఇబ్బందిలేదు
మాది కర్నూలు జిల్లా. ఇక్కడే శ్రీనగర్ కాలనీలో ఉంటూ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా. ఉపవాసదీక్ష సమయంలో తెల్లవారుజామున తినాలంటే హోటళ్లు అందుబాటులో ఉండవు. ఎల్లారెడ్డిగూడ మసీదు ఆవరణలో సహర్ సదుపాయం ఉండటం వల్ల నా ఉపవాసాలకు ఎలాంటి ఇబ్బందిలేదు. – షాకీర్, శ్రీనగర్ కాలనీ
ఉచిత సహర్ బాగుంది
మా సొంతూరు ప్రకాశం జిల్లా. బంజారాహిల్స్లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నా. అమీర్పేటలో రూమ్లో ఉంటున్నా. రంజాన్ ఉపవాస దీక్షలో సహెర్ విందుకు సిద్ధం చేయటం కాస్త ఇబ్బంది ఉంటుంది. ఉదయాన్నే వంటలు చేయటం కష్టం. అందుకే ఎల్లారెడ్డిగూడలో ఉచిత సహెర్ విందుకు వెళతాను. ఇక్కడ విందు చాలా బాగుంటుంది.
– రఫీ, అమీర్పేట