ఉచితంగా డయాబెటిస్, బీపీ మందులు
ఇంటింటి సర్వేకు విశేష స్పందన
సుల్తాన్బజార్, మే 24 : పేదలు ఆరోగ్యంగా ఉండాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుంది. వైద్యఆరోగ్య కార్యకర్తలతో ఇంటింటి సర్వే నిర్వహించి గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులు (డయాబెటిస్) రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టింది. కింగ్ కోఠి క్లస్టర్ పరిధిలోని అన్ని యూపీహెచ్సీలలో ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి స్క్రీనింగ్ చేసి వివరాలను నమోదు చేస్తారు. ఈ సర్వేలో డయాబెటిస్ రోగులను గుర్తించి సంబంధిత యూపీహెచ్సీలోని మెడికల్ ఆఫీసర్ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి రోగికి మందులను ఇస్తారు. ఏఎన్ఎంలు రోగి ఇంటి వద్దే మందులను పంపిణీ చేయడంతో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల సంతోషానికి అవధులు లేవు. ప్రధానంగా వయసుపై బడిన వారే అధికంగా ఉండటంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో క్యూలైన్లలో.. నేడు ఇంటి వద్దకే
హైపర్ టెన్షన్ (బీపీ), షుగర్ వ్యాధి బారిన పడిన ప్రజలలో అత్యధికంగా వయస్సుపై బడిన వారే ఉండటంతో గతంలో యూపీహెచ్సీల వద్ద క్యూలైన్లు కట్టి మందులను తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారి బాధలను గుర్తించి ఇంటి వద్దనే మందులను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. కింగ్ కోఠి క్లస్టర్ పరిధిలోని అన్ని యూపీహెచ్సీల్లో ఇప్పటికే 22 శాతం సర్వేను పూర్తి చేశారు. ఈ సర్వేలో రెండు శాతం బీపీ రోగులు, 6 శాతం షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గుర్తించారు. వీరికి ఆయా యూపీహెచ్సీల మెడికల్ ఆఫీసర్ పరీక్షించిన అనంతరం మందులను ఏఎన్ఎం, ఆశవర్కర్లు అందజేస్తారు. సాధారణంగా బీపీ ఉన్న వారు నిత్యం ఒక గోలిని వాడితే.. షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం నిత్యం రెండు పూటలా మందులను వాడాల్సి ఉంటుంది.వారికి సరిపడా మందులను ఉచితంగా అందజేయడంతో పాటు ఇంటి వద్దనే అందజేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం కొనసాగుతున్న సర్వే..
వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఆరోగ్య కార్యకర్తలు నిత్యం శ్రమిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి డయాబెటిస్, బీపీ వివరాలను స్క్రీనింగ్ చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ పరీక్షలు నిర్వహించిన వారి అవసరమైన మందులను ఇస్తున్నారు. మందులను సరియైన క్రమంలో తీసుకోకపోతే ఇతర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
క్లస్టర్ పరిధిలో 22 శాతం సర్వే పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలను తీసుకుంటుంది. క్లస్టర్ పరిధిలోని దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. క్లస్టర్ పరిధిలో 22 శాతం సర్వే పూర్తి అయింది. నిత్యం ఒక ఏఎన్ఎం, ఆశవర్కర్లు ఇంటింటికి వెళ్ళి సర్వే నిర్వహించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. సర్వేకు అందరూ సహకరించి పూర్తి వివరాలు తెలియజేయాలి.
– డాక్టర్ పద్మజ, ఎస్పీహెచ్వో,కింగ్ కోఠి క్లస్టర్