యంత్ర ‘మనిషి’ చీటింగ్ అంటూ..
ఆన్లైన్ పేకాట రాయుళ్ల విచిత్ర ఫిర్యాదులు
సిటీబ్యూరో, జూలై 13(నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో పేకాటాడుతున్న వారు తెలివి మీరుతున్నారు. ఆన్లైన్లో వివిధ యాప్లను డౌన్లోడ్ చేసుకొని.. జూదమాడి.. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆపై యంత్రం తయారు చేసిన మనిషితో పేకాట ఆడించి.. నిండా ముంచారని విచిత్రంగా ఫిర్యాదు చేస్తున్నారు. తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకొని..తమ డబ్బులను తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి ఫిర్యాదులు పదుల సంఖ్యలో వస్తున్నాయి.
1966 సార్లు..
చింతల్కు చెందిన ఓ వ్యాపారి 2021 అక్టోబర్ నుంచి 2022 జూలై 8వ తేదీ వరకు తన స్నేహితుడు చెప్పాడని వివిధ యాప్లను డౌన్లోడ్ చేసుకున్నాడు. సుమారు 9 నెలల్లో దాదాపు 1966 సార్లు మూడు ముక్కల ఆటలో బ్లైండ్-సీన్లంటూ దాదాపు 40 లక్షల రూపాయలను సమర్పించుకున్నాడు. ఇప్పుడేమో ఆన్లైన్లో యంత్ర మనిషితో పేకాట ఆడించి.. మోసం చేశారని ఫిర్యాదు చేశాడు. తన స్నేహితుడు ఆన్లైన్ యాప్లో ఆటలు ఆడితే భారీగా డబ్బులు వస్తాయని చెప్పడంతో తాను డౌన్లోడ్ చేసుకొని ఆడానని.. మోసపోయానని ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.
పేకాట ఆడటం నేరం…
ఆన్లైన్ గ్యాంబ్లింగ్, పేకాట యాప్లకు సంబంధించి.. అనేక సార్లు గూగుల్తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాశాం. వారు మాత్రం.. చట్ట ప్రకారం మాకు అనుమతులు ఉన్నాయి…మా ఐపీ అడ్రస్సులు ఉన్న దేశం మాకు అనుమతులు ఇచ్చింది. కాబట్టీ ఇక్కడి చట్టాలను పాటిస్తున్నామని జవాబులు ఇస్తున్నారు. దీంతో కేసులు నమోదు చేయడం సాధ్యం కావడం లేదు. ఐపీ అడ్రస్సులన్నీ విదేశాల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో జూదమే నిషేధం ఉండగా, చాలా మంది తమను మెషిన్ జనరేటెడ్ పర్సన్తో పేకాట ఆడించి.. మోసం చేశారని ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి యాప్ల ద్వారా పేకాట ఆడటమే నేరం.. చర్యలు తప్పవు.
–శ్రీధర్, ఏసీపీ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్