జవహర్నగర్, మార్చి 25: ఆడుకుంటున్న బాలుడు ఒక్కసారిగా వేడినీటి బకెట్లో పడటంతో ఛాతికి తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ విషాద ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఎస్హెచ్ఓ సైదయ్య తెలిపిన ప్రకారం… జవహర్నగర్ కార్పొరేషన్ బాలాజీనగర్ మార్కెట్లేన్లో నివాసముంటున్న కాటి నర్సింహ, భార్య సుమలతలకు ఇద్దరు కుమారులున్నారు.
నర్సింహ స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పిల్లలను చూడటానికని సుమలత తల్లి పుల్లమ్మ నర్సింహ ఇంటికి వచ్చింది. ఈనెల 23న సమీపంలో ఉన్న నర్సింహ సోదరుడు సాయి ఇంటికి పుల్లమ్మ మనుమడు కాటి బన్నీ(4)ను తీసుకుని వెళ్లింది. స్నానానికి వాటర్ హీటర్ను పెట్టిన సాయి కుటుంబసభ్యులు హీటర్ను తీసి బకెట్ను అక్కడే ఉంచారు.
కుటుంసభ్యులు మాటమంతిలో ఉండగా.. బన్నీ ఆడుకుంటూ వెళ్లి వేడినీటి బకెట్లో పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు బన్నీని బయటకు తీసి చూడగా.. ఛాతిభాగం కాలిపోయింది. వెంటనే స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించగా.. చికిత్స పొందుతూ ఈనెల 25న మంగళవారం మరణించాడు. బన్నీ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబసభ్యులు జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.