సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికకు నామినేషన్ల కోలాహలం మొదలైంది. గురువారం తొలి రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మూడో అంతస్తులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా..నలుగురు ఇండిపెండెంట్గా నామినేషన్లు వేశారు. కాటేపల్లి జనార్దన్రెడ్డి, అన్వర్ఖాన్, బి. భుజంగరావు, గుర్రం చెన్నకేశవరెడ్డి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్, రిటర్నింగ్ అధికారి ప్రియాంకకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగనుందని అధికారులు పేర్కొన్నారు.