Hyderabad Metro | సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : మెట్రో రెండో దశ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దశకు అనుసంధానంగా పలు మార్గాల్లో మొత్తం 7 కారిడార్లలో 70 కి.మీ కొత్తగా మెట్రో కారిడార్లను నిర్మించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రాథమిక సర్వే పూర్తి చేశారు. మెట్రో అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించే పనుల్లో ఉన్నారు. ఇప్పటికే రెండు ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థలు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్నాయి. వీలైనంత త్వరగా మెట్రో రెండో దశ పనులు మొదలు పెట్టాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టింది.
రెండో దశ మెట్రోలో అత్యంత కీలకమైన మార్గంగా ఉన్న నాగోల్-శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గంలోని చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి ప్రాంతాల్లో ఏదో ఒక చోట సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన చేయనున్నారని, శంకుస్థాపనకు అనుకూలమైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని మెట్రో అధికారులు తెలిపారు. 7 కారిడార్లలో అత్యంత పొడవైన కారిడార్ నాగోల్-శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గం 21 కి.మీ దూరం ఉంది. మిగతా మార్గాలైన మియాపూర్-పటాన్చెరువు 14 కి.మీ, ఎల్బీనగర్-హయత్నగర్ 8 కి.మీ, రాయదుర్గం-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ 8 కి.మీ, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు మరో 8 కి.మీ మేర నిర్మించేందుకు డీపీఆర్ను రూపొందిస్తున్నారు. వీటితో అత్యంత కీలకమైన నాగోల్-శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గంలో ఇన్నర్ రింగురోడ్డుపై ఉన్న చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి ప్రాంతాల్లో ఇంటర్చేంజ్ స్టేషన్లను నిర్మించే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతాల్లోనే సీఎం రేవంత్రెడ్డితో శంకుస్థాపన చేసేందుకు మెట్రో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.