బన్సీలాల్పేట్, సెప్టెంబర్ 23 : నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, అందుకు ఎంత ఖర్చు అయినా వెనుకాడమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బన్సీలాల్పేట్ డివిజన్లో రూ.1.95 కోట్లతో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ హేమలతతో కలిసి ప్రారంభించారు. పద్మారావునగర్లోని వెస్లీ చర్చి వద్ద రూ.51.50 లక్షలతో, శివానంద ఆశ్రమం వద్ద రూ.21 లక్షలతో సిమెంట్ రోడ్డు, హమాలీబస్తీలో రూ.16.50 లక్షలతో, బన్సీలాల్పేట్ సీ-క్లాస్లో రూ.25 లక్షలతో ఎస్ఎస్ ఫ్లోరింగ్ పనులు, బర్కాల బస్తీలో రూ.30 లక్షలతో ఎస్ఎస్ ఫ్లోరింగ్, సిమెంట్ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. సీ-క్లాస్ ప్రాంతంలో ప్రజల కోరిక మేరకు నూతన కమ్యూనిటీ హాలు నిర్మాణం చేసి, అందులో స్థానిక మహిళలకు ఉపాధి శిక్షణ అందజేస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తరువాతనే ఊహించని స్థాయిలో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు.
కాలనీలు, బస్తీలు అనే తేడా లేకుండా రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్లు, పార్క్లు, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేశామన్నారు. తన దృష్టికి ఎలాంటి ప్రజా సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. సనత్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపాలను కూడా మంత్రి తలసాని సందర్శించగా, నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఇన్చార్జి పవన్కుమార్ గౌడ్, అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, బేగంపేట్ డీసీ శంకర్, ఈఈ సుదర్శన్, జలమండలి సీజీఎం ప్రభు, విద్యుత్ శాఖ డీఈ శ్రీధర్, నాయకులు లక్ష్మీపతి, ఏసూరి మహేశ్, రజాక్, ఫహీమ్, అబ్బాస్, శ్రీకాంత్రెడ్డి, దేశపాక, రమణ, కుమార్, అరుణ్, వెంకట్, సురేశ్, వివిధ బస్తీల నాయకులు పాల్గొన్నారు.