దొంగ అరెస్టు
20లక్షల విలువైన 14 బైకులు స్వాధీనం
వెల్లడించిన కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్
మూసాపేట, మార్చి16: హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగలించి తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్తున్ని కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం కూకట్పల్లి పోలీస్స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్, డీఐ ఆంజనేయులు వివరాలు వెల్లడించారు. కిషన్బాగ్కు చెందిన సర్ధార్ కరణ్వీర్ సింగ్(22) పలు కేసుల్లో గతంలో జైలుకు వెళ్లి వచ్చాడు. వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో 14 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేశాడు. కైత్లపూర్కు చెందిన మంగళి పాండు(21) హేర్ సెలూన్ నిర్వహిస్తుంటాడు. ఈ నెల 7న తన షాపు ముందు తాళం వేసి పార్కు చేసిన TS 08GP 3302 పల్సర్ 220 బైక్ చోరికి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కైత్లాపూర్లో బైక్ అపహరించిన దృశ్యాలు సీసీటీవి కెమోరాలో లభించాయి. సదరు క్లూస్తో దర్యాప్తు చేపట్టిన పోలీసులు దొంగలించిన బైకును తీసుకుని కూకట్పల్లి వైపునకు వెళ్లినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో నిఘా పెట్టిన పోలీసులు బుధవారం కూకట్పల్లి వై జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో 2 ద్విచక్రవాహనాలు, గోల్కండ పరిధిలో 1, పంజాగుట్ట1, సనత్నగర్ 2, కేపీహెబీ పరిధిలో 4, మాధపూర్1, ఎస్ఆర్నగర్ 2, జుబ్లిహిల్స్ పరిధిలో1, మొత్తం 14 బైకులు దొంగలించినట్లు అంగీకరించారు. బైకులను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా డీఐ ఆంజనేయులు, ఎస్సై అబ్ద్దుల్ రజాక్ను ఏసీపీ చంద్రశేఖర్ అభినందించారు. కార్యక్రమంలో అడ్మిన్ ఎస్సై శంకర్ తదితరులు పాల్గొన్నారు.