బడంగ్పేట్, ఫిబ్రవరి12: కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా గ్రేటర్ హైదరాబాద్ను మూడు ముక్కలు చేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ప్రజా ప్రతినిధులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం సబితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విభజనపై ప్రభుత్వానికి స్పష్టమైన ప్రాతిపాదిక లేదన్నారు. ప్రజా స్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ సర్కార్ విభజన నిర్ణయం తీసుకుందని సబిత ఆరోపించారు.
ఏ ప్రాతిపదికన విభజన చేశారు..?
రాజేందర్నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలోని పట్టణ ప్రాంతాలను రెండు వేరువేరు కార్పొరేషన్లలో కలపడం పట్ల ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో చెప్పాలన్నారు. సైబరాబాద్ కార్పొరేషన్కు అత్యంత సమీపంలో ఉన్న బండ్లగూడ, రాజేంద్రనగర్, శంషాబాద్ లాంటి ప్రాంతాలను జీహెచ్ఎంసీలో చేర్చడం ఎందుకన్నారు. మల్కాజిగిరి కార్పొరేషన్కు పక్కన ఉన్న బడంగ్పేట్, మీర్పేట్, తుక్కగూడ ప్రాంతాలను జీహెచ్ఎంసీ పరిధిలో ఉంచడం ఏమిటన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తుర్కయంజాల్ ప్రాంతాన్ని మల్కాజిగిరిలో చేర్చకుండా జీహెచ్ఎంసీలో కల్పడం ఏవిధమైన ప్రాతిపాదకనో చెప్పాలన్నారు. కొత్త జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు సైబరాబాద్ కార్పొరేషన్లో 76 డివిజన్లు, మల్కాజిగిరి కార్పొరేషన్లో 74 డివిజన్లు ఉండటం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విభజనతో రంగారెడ్డి జిల్లా పరిపాలన స్థిరత్వం దెబ్బతింటుందన్నారు. ఆనాలోచిత నిర్ణయతో ప్రజలు ఇబ్బంది పెడుతున్నారన్నారు. విభజనను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.