మెహిది పట్నం మే 25: కవిత్వంతో, సామాజిక కృషితో తెలంగాణ సమాజం మీద బలమైన ప్రభావం వేసిన వ్యక్తి నందిని సిధారెడ్డి అని, తెలంగాణ గడ్డ మీద జరిగిన ప్రతి ఉద్యమంలోనూ ఆయన పాత్ర గణనీయంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం మాసబ్ ట్యాంక్లోని కాంటినెంటల్ పార్క్ హోటల్లో సిధారెడ్డి ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నాకు సిధారెడ్డితో రెండు దశాబ్దాలకు పైబడిన అనుబంధం ఉందన్నారు.
ఆయన చాలా నిరాడంబరంగా చాలా నిక్కచ్చిగా ఉంటారన్నారు. ఒకరి నుంచి ప్రయోజనం పొందడం కోసమో, ఒకరి నుంచి మెప్పు పొందడం కోసమో చాలామంది తమ అభిప్రాయాలను ఈజీగా మార్చుకుంటరని, సిధారెడ్డి మాత్రం నమ్మిన విషయాల పట్ల నిజాయితీగా, నిబద్ధతతో ఉంటూ దేని కోసం రాజీ పడకపోవడం అదే ఆయనలోని ప్రత్యేకత అన్నా రు. తెలంగాణ ఉద్యమం కోసం తన ప్రమోషన్ సైతం వదులుకున్నారని తెలిపారు.
ఆకాశం అంత ఎత్తుకు ఎదిగారు..
సిధారెడ్డి ప్రలోభాలకు లొంగరన్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం సిధారెడ్డికి కోటి రూపాయలు, 300 గజాల జాగ ఇవ్వదలిచినప్పుడు మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆ అవార్డు తీసుకోకుండా తిరస్కరించారన్నారు. తెలంగాణ తల్లి రూపం మార్చినందుకు నిరసన తెలియజేసి, ప్రభుత్వం ఇవ్వజూపిన అవార్డును తిరస్కరించడంతో సిధారెడ్డి వ్యక్తిత్వం ఆకాశమంత ఎత్తుకెదిగిందని పేర్కొన్నారు.
అందుకే ఆయన కవిత్వం, వ్యక్తిత్వం అంటే ఎంతో ఇష్టం అని సిధారెడ్డి వారి కవిత్వంలో స్పృశించని అంశం లేదని, ముఖ్యంగా తెలంగాణ రైతుల కష్టాల గురించి, కన్నీళ్ల గురించి రాసిన కవితలు అద్భుతంగా ఉంటాయని హరీష్ రావు చెప్పారు. రైతులు, స్త్రీలు, దళితులు, సమాజంలో అణిచివేతకు గురవుతున్న అందరి పక్షాన నిలబడి కవిత్వం రాసారని రైతుల గురించి బోరు దు:ఖం అనే ఒక అద్భుతమైన కవిత రాసిండన్నారు.
సిధారెడ్డికి 70ఏళ్లు నిండిన సందర్భంగా ఆత్మీయులందరం కలిస్తే బాగుంటదని దేశపతి, విరాహత్లు చెప్పగానే వెంటనే నేను ఒప్పుకున్నా అని తెలిపారు. ఇవాళ ఈ ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, సిధారెడ్డి నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వారు మరెన్నో రచనలు చేసి, సమాజాన్ని చైతన్య పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.
కవిత్వంలో దుఖం, వ్యంగం ఉంటుంది..
సిధారెడ్డి కవిత్వంలో దుఖం ఉంటది, వ్యంగ్యం ఉంటది, కానీ ఏది రాసినా అది అద్భుతంగా ఉంటదని, సిధారెడ్డి కేవలం కవిత్వం రాయడంతోనే తన బాధ్యత తీరిందనుకోలేదని, మెదక్ జిల్లాలో మంజీరా రచయితల సంఘాన్ని స్థాపించి ఎంతో మంది కవులను తీర్చిదిద్దారన్నారు. దేశపతి శ్రీనన్న, తైదల అంజయ్య ఇంకా చాలామంది కవులు సిధారెడ్డి చేత, మంజీరా రచయితల సంఘం చేత ప్రభావితమై, ఎదిగి వచ్చారని చెప్పారు.
ఉద్యోగ సంఘాల నేతగా ఎదిగిన మా దేవి ప్రసాద్, దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిన రామలింగా రెడ్డి, జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు విరాహత్ అలీ, సీనియర్ జర్నలిస్టు రంగాచారి ఇట్ల ఎంతో మందికి సిధారెడ్డి ప్రేరణ అని చాలా మందికి తెలుసన్నారు. మాజీ సీఎం కేసీఆర్, సిధారెడ్డి క్లాస్మేట్స్ అని ఒకరంటే మరొకరికి గొప్ప గౌరవం. అనుబంధం ఉన్నాయని, సిధారెడ్డి సామర్థ్యం తెలుసు గనుకనే కేసీఆర్ సార్ తెలంగాణ సాహిత్య అకాడమీ నెలకొల్పి దానికి మొదటి అధ్యక్షుడిగా సిధారెడ్డినే నియమించారని గుర్తుచేశారు.
సిధారెడ్డి నేతృత్వంలోనే ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో గొప్పగా, విజయవంతంగా జరిగి, ప్రభుత్వానికి, తెలంగాణకు ఎంతో పేరు వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహిస్తే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ సుందరీమణుల పోటీలు పెడుతున్నదని విమర్శించారు.70 ఏళ్లు పూర్తి చేసుకున్న సిధారెడ్డికి శుభాకాంక్షలు తెలిపి,నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మరెన్నో రచనలు చేయాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం సిధారెడ్డి దంపతులను హరీష్రావు ఘనంగా సన్మానించారు.