కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని చెప్పి సీఎం రేవంత్రెడ్డి నయవంచన చేశారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. జలమండలిలో యూనియన్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అనుబంధ వాటర్ వర్క్స్ కామ్గార్ యూనియన్ గురువారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో ఉద్యోగులకు రావాల్సిన ఆరు డీఏలు, పీఆర్సీ ఎగ్గొట్టిందని, కాంగ్రెస్ చేస్తున్నది ప్రజా పాలన కాదని.. ప్రజా వంచన పాలన అని హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైనా తీపి కబురు చెప్తారని చూస్తే.. ఉలుకూ పలుకూ లేకుండా మమా అనిపించారన్నారు. ప్రజలకిచ్చిన ఒక్క హామినీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జలమండలి కామ్గార్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నయవంచన చేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. హైదరాబాద్ జలమండలి యూనియన్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అనుబంధ వాటర్ వర్క్స్ కామ్గార్ యూనియన్ గురువారం నిర్వహించిన సమావేశంలో మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి హరీశ్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ .. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో ఉద్యోగులకు రావాల్సిన ఆరు డీఏలు, పీఆర్సీ ఎగ్గొట్టిందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్నది ప్రజా పాలన కాదని.. ప్రజా వంచన పాలన అని ఎద్దేవా చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైనా తీపి కబురు చెప్తారని చూస్తే ఉలుకూ పలుకూ లేకుండా మమా అనిపించారని తెలిపారు. ప్రజలకిచ్చిన ఒక్క హామినీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని అన్నా రు. అంగన్వాడీల జీతాలు పెంచుతామని మోసం చేశారన్నారు. ఇటీవల పటాన్చెరులోని సిగాచి ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి కార్మికులు చనిపోతే ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని చెప్పి.. నిలువునా మోసం చేసి వారికి ఎగనామం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేస్తామని అదీ అరకొరగానే చేశారని.. సీఎం రేవంత్రెడ్డికి మాట నిలబెట్టుకోకుండా ఏదో శాపం ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు.

విస్తరణతో జలమండలికి అన్యాయం
నగరాన్ని విస్తరించి మూడు ముక్కలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం జలమండలిలో ఉద్యోగులను మాత్రం పెంచలేదని ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. పరిధి పెంచి ఉద్యోగుల సంఖ్య పెంచకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జలమండలి ఉద్యోగుల యూనియన్ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అది చేస్తాం.. ఇది చేస్తామంటున్నారని.. మరి రెండున్నరేండ్లుగా జలమండలి ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతుంటే ఎవరు ఆపారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో జలమండలిలో 650 కార్మికులను రెగ్యులరైజ్ చేశామని గుర్తు చేశారు. వందలాది మందికి పదోన్నతులు కల్పించామని అన్నారు. జలమండలి ఉద్యోగులకు మళ్లీ మంచిరోజులు రావాలంటే కామ్గార్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఒక్క ఉద్యోగం ఇవ్వలే
జలమండలిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు తప్ప.. కాంగ్రెస్ వచ్చాకా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ హయాంలో 2 వేల ఉద్యోగాలు జలమండలిలో భర్తీ చేశాం. నగరంలో జనాభా పెరిగింది.. వాటర్ బోర్డు పరిధి పెరిగింది కానీ.. ఉద్యోగుల సంఖ్య మాత్రం పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నది. రాంబాబు యాదవ్ను గెలి పించాలి.
– జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
బీఆర్ఎస్తోనే కార్మికుల సంక్షేమం
కార్మికుల హక్కుల సాధన, వారి సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జలమండలిని నిర్లక్ష్యం చేస్తున్నారు. జలమండలిలో నిరంతరం కార్మికుల పక్షాన నిలుస్తూ వారి సమస్యలు పరిష్కరించేందుకు పాటు పడుతున్న రాంబాబు యాదవ్ను గెలిపించాలి. రాంబాబు కార్మికుల పక్షాన పోరాడుతాడు..యూనియన్ అధ్యక్షుడిగా ఉండటం అవసరం. కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తిని ఓడించాలి.
– మాజీ హోం మంత్రి మహమూద్ అలీ
కార్మికుల పక్షాన పోరాడేది బీఆర్ఎస్సే
ఆనాడైనా.. ఈనాడైనా కార్మికుల పక్షాన పోరాటాలు చేసేది ముమ్మాటికీ బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ మహానగరాన్ని మూడు ముక్కలు చేసి.. గోల్మాల్ గోవిందా లాగా చేస్తున్నారని ఆరోపించారు. అవగాహన, ప్రణాళిక లేకుండా నగరాన్ని విభజించి ఉద్యోగులు, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. నగరానికి సరిపడా నీళ్లవ్వలేని పరిస్థితి నేడు జలమండలిలో ఉన్నదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీరిచ్చామని తెలిపారు. కార్మికుల పక్షాన గొంతు వినిపించే బీఆర్ఎస్ అనుబంధ కామ్గార్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
– సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

Hyd12