కందుకూరు, డిసెంబర్ 18 : కావాలనే ఫార్మాసిటీ ప్రభుత్వం రద్దు చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మెగాసిటీ ఏర్పాటు చేస్తే ఎవరికి లాభమని ప్రశ్నించారు. సోమవారం కందుకూరు మండల పరిధిలోని మీర్ఖాన్పేట్ గ్రామానికి చెందిన సర్పంచ్ బ్రహ్మణపల్లి శేఖర్ గుప్తా, ఎంపీటీసీ కాకి రాములు ఎమ్మెల్యే సబితారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫార్మాసిటీ ఏర్పాటైతే మీర్ఖాన్పేట్ గ్రామంతో పాటు పరిసర గ్రామాల రూపురేఖలు మారేవని, పరిశ్రమల రాకతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించేవని అన్నారు. ఎంతో ముందు చూపుతో కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీని తీసుకువస్తే రాజకీయ లబ్ధి కోసం ఫార్మాసిటీని రద్దుచేయడం తగదన్నారు. మెగాసిటీ ఏర్పాటు చేస్తే ఎవరికి లభమని ప్రశ్నించారు.
ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తున్నదని ఆరోపించారు. మీర్ఖాన్పేట్తో పాటు ఆకులమైలారం, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, పంజగూడ, అన్నోజిగూడ, ఊట్లపల్లి తదితర గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. భూము లు కోల్పోయిన వారికి ఎకరాకు 121 గజాల ప్లాట్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామని, అందుకోసం 600ఎకరాల్లో వెంచర్ చేసినట్లు చెప్పారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల మధ్యనే ఉంటూ పని చేస్తానని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సత్తయ్య, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శివప్రసాద్, చంద్రశేఖర్, అరుణ, కాకి రవి, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.