సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్లో ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీ పార్కు అందుబాటులోకి వచ్చింది. మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డును ఆనుకుని ఉన్న అటవీ పార్కు ఇప్పుడు ఐటీ కారిడార్లోని నివాసం ఉంటున్న వారికి పేవరేట్ హాట్ స్పాట్గా మారింది. ఒకవైపు పట్టణీకరణతో పెరుగుతున్న కాలుష్య తీవ్రత… మరోవైపు ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడి..వెరసి నగర వాసి జీవన విధానాల్లో వస్తున్న మార్పులతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి నుంచి నగర వాసులకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. తాజాగా నగరానికి పడమర దిక్కున వేగంగా విస్తరిస్తున్న ఐటీ కారిడార్లో సుమారు 250కి పైగా ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కుగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ తీర్చిదిద్దింది.
ఆహ్లాదంగా అటవీ పార్కు…
హైదరాబాద్ మహానగరంలో అటవీ ప్రాంతాలు నగర వాసులకు పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నగరం నడిబొడ్డున బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కొండల మధ్య ఉన్న కేబీఆర్ పార్కు తరహాలోనే ఐటీ కారిడార్లోని కోకాపేట, పుప్పాల్గూడ, నానక్రాంగూడ, గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి ప్రాంతాలకు సమీపంలో ఉన్న మంచిరేవులలో సుమారు 250 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. దీన్ని పట్టణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా అర్బన్ ఫారెస్ట్ పార్కుగా తీర్చిదిద్దారు. ఔటర్ రింగు రోడ్డు నిర్మాణంతో దాని మధ్యలోంచే గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ వెళ్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతం చుట్టు పక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నివాస ప్రాంతాలు రావడంతో నగరంలోని కేబీఆర్ పార్కు తరహాలో దీనిని అభివృద్ధి చేసి, నగర వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. నిత్యం వందలాది మంచి సందర్శకులు వస్తుండగా, శని, ఆదివారాల్లో మాత్రం వెయ్యి మందికి పైగా వస్తున్నారని అధికారులు తెలిపారు.
పార్కులో ఏర్పాటు చేసిన వసతులు
పార్కుకు మంచి స్పందన ఉంది
హైదరాబాద్ నగరం ఐటీ కారిడార్ వైపు వేగంగా విస్తరించింది. ఐటీ కార్యాలయాలతో పాటు నివాస ప్రాంతాలు పెద్ద మొత్తంలో వచ్చాయి. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కు ఎంతో అనుకూలంగా ఉంది. వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న పార్కులో రకరకాల ఏర్పాట్లు చేశాం. పార్కు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. శని, ఆదివారాల్లో వెయ్యి మందికి పైగా సందర్శిస్తున్నారు. ఇతర రోజుల్లో 3 నుంచి 4 వందల దాకా సందర్శకులు వస్తున్నారు.
– స్కైలాబ్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎకోటూరిజం, టీఎస్డీసీఎల్
నేడు పార్కులో బర్డ్ వాక్
ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని లోపలి వైపు తెలంగాణ పోలీస్ అకాడమీ వెనక ఉన్న చిలుకూరి ఫారెస్ట్ 250కి పైగా ఎకరాల్లో విస్తరించింది. చెట్లు, గుట్టలు, నీటి కుంటలు, చెరువు ఉండటంతో పక్షులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పార్కులో ఉన్న రకరకాల పక్షులను గుర్తించేందుకు ఆదివారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు బర్డ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 30 నుంచి 40 మంది వరకు పక్షి ప్రేమికులు ఇక్కడికి వస్తున్నారని అటవీ శాఖ ఎకోటూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ స్కైలాబ్ తెలిపారు.