మేడ్చల్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటి విడత విజయవంతమైన నేపథ్యంలో.. రెండో విడత దళిత బంధు పథకాన్ని అందించేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో జిల్లా పరిధిలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులకు దళిత బంధును అందించారు. దీంతో లబ్ధిదారులు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి సాధించే దిశగా పయనిస్తున్నారు. రెండో విడతలో జిల్లా వ్యాప్తంగా 5,500 మందికి దళిత బంధును వర్తింపజేసేలా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
రెండో విడతలో నియోజకవర్గానికి 11 వందల మందికి దళిత బంధును వర్తింపజేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తున్న క్రమంలో త్వరలోనే అర్హుల జాబితాను ఎంపిక చేయాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
జాబితా ఎంపికకు ప్రత్యేక అధికారులు..
దళిత బంధు పథకాన్ని అర్హులకు అందించేందుకు జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ ప్రత్యేక అధికారులను నియమించారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతో పాటు కొంత భాగం పరిధిలోకి వచ్చే శేరిలింగపల్లి, ఎల్బీనగర్, సనత్నగర్, జాబ్లీహిల్స్ నియోజకవర్గాలకు 9 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. దళిత బంధు పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన వంటి పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
దళారులను నమ్మవద్దు
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోంది. దళారుల మాటలు నమ్మవద్దు. ప్రజాప్రతినిధుల, అధికారుల పేర్లు చెప్పి కొందరు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అర్హులైన దళితులందరికీ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తుంది. త్వరలోనే రెండో విడత దళిత బంధు పథకం వర్తింపజేసేందుకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేస్తాం. దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు తమకు ప్రావీణ్యం ఉన్న వ్యాపారాలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
-బాలాజీ, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి