CM KCR | సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : ‘సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు హైదరాబాద్ మహానగరం సర్వం సిద్ధమైంది. ప్రజా నాయకుడి జన్మదినం సందర్భంగా యావత్ ప్రజానీకం పులకించిపోతున్నది. జననేతకు పుట్టినరోజు కానుక ఇచ్చేందుకు సబ్బండ వర్ణాలు కదం తొక్కుతున్నాయి. కేక్ కటింగ్లతోపాటు మొక్కలు నాటడం.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు నాయకులు, పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. సామాన్య ప్రజానీకం సైతం భాగస్వామ్యులై వాడవాడల్లో పండుగలా పుట్టినరోజు వేడుకలను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు రోజుల ముందే సంబురాలు మొదలవ్వడంతో హైదరాబాద్ మహా నగరం గులాబీమయమైంది.
రెండు రోజులు ముందుగానే సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నగరంలో మొదలయ్యాయి. వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లు, వీధులు గులాబీరంగును పులుముకున్నాయి. ‘దేశ్ కీ నేత కేసీఆర్’ వంటి నినాదాలతో ఎటుచూసినా హోర్డింగ్లు, ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. 2001లో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో దేశ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సీఎం కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నేతలు రహదారుల వెంట భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
స్వరాష్ట్రంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అమలుచేసిన సంక్షేమ పథకాలు సబ్బండ వర్ణాలకు గొడుగులా నీడనిచ్చి అండలా నిలుస్తున్నాయి. ‘రైతు బంధు’ ఎవుసానికి ఆసరాగా నిలువగా.. ఇంటి పెద్దను కోల్పోయి ఛిన్నాభిన్నమైన కుటుంబాలకు ‘రైతు భీమా’ పెద్ద దిక్కుగా నిలిచింది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్.. ఇలా ఎన్నో పథకాలు విధి రాతకు ఎదురు నిలిచే ధైర్యాన్ని ఇచ్చాయి. పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలే మారిపోయాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు ఏండ్లనాటి తండ్లాటలను తీర్చాయి. ఎన్ని ప్రకృతి విపత్తులు ఏర్పడినా.. సంక్షోభ పరిస్థితులు వెంటాడినా.. సంక్షేమం, అభివృద్ధి అప్రతిహతంగా సాగుతున్నది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, కేంద్రం ఎంత విషం చిమ్మినా.. పరిపాలనలో ఆత్మైస్థెర్యం సడలక రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో నిలిచింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించిన సీఎం కేసీఆర్ నేటి శ్రీకృష్ణదేవరాయులు అంటూ యావత్ ప్రజానీకం ప్రశంసలు కురిపిస్తున్నది. వీటన్నింటికి మద్దతుగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా ఏర్పాటుచేసిన భారీ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
అన్నివర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్. ప్రతి వ్యక్తి కోరుకున్న విధంగానే గత ఎనిమిదేండ్లుగా తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం నిర్విఘ్నంగా సాగింది. ఏ రాష్ట్రంలోలేని పథకాలు తెలంగాణలోనే అమలై అనేక కుటుంబాలకు భరోసాను ఇచ్చాయి. పార్టీలకతీతంగా నిధులు కేటాయించి పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేశారు. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రిని పునర్నిర్మించి చరిత్రలో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. కేసీఆర్ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచేందుకు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం. గత యేడాది రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖనిలో బియ్యంతోపాటు 17 రకాల వస్తువులతో కూడిన రూ.5వేల విలువ జేసే 4,800 కిట్లను కోలేటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశాం. ఈసారి సూరత్ నుంచి తెప్పించిన 23వేల చీరలను కేసీఆర్ పుట్టిన రోజున ఆడపడుచులకు అందజేయనున్నాం. ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో 120 హోర్డింగ్లు, 800 ఫ్లెక్సీలను ప్రభుత్వ పథకాల నినాదాలతో ఏర్పాటు చేశాం. 960 బస్టాండ్ల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాం. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటున్నది.
– కోలేటి దామోదర్ గుప్తా,పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
☞ నెక్లెస్ రోడ్లోని సంజీవయ్య పార్ పకన ఉన్న థ్రిల్ సిటీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు. సంక్షేమ పథకాలపై జబర్ధస్త్ కళాకారులతో ప్రత్యేక కార్యక్రమం. భారీ కేక్ కటింగ్, భోజన ఏర్పాట్లు. వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ.
☞ సికింద్రాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆయుష్షు హోమం.
☞ బలంపేట ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ హోమం, రాజశ్యామల యాగం
☞ సికింద్రాబాద్ గణేశ్ ఆలయంలో చండీయాగం
☞ జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అభిషేకం
☞ సికింద్రాబాద్ గణేశ్ దేవాలయంలో డిఫ్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో చండీయాగం
☞ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో సీఎం కేసీఆర్ గోత్రనామాలతో అర్చన
☞ ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో లక్ష పుష్పార్చన
☞ సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఉన్న వెస్లీ చర్చిలో, అబిడ్స్లోని వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
☞ నాంపల్లి దర్గాలో, నల్లగుట్ట మసీదులో చాదర్ సమర్పణ
☞ అమీర్ పేట గురుద్వార్లో హర్ధాస్, గౌలిగూడ గురుద్వార్లో హర్ధాస్ (ప్రత్యేక ప్రార్థనలు)
☞ గాంధీ హాస్పిటల్లో బీఆర్ఎస్ నాయకులు గుర్రం పవన్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ
☞ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ
☞ నగరంలోని అన్ని నియోజకవర్గాలు, డివిజన్లలో రక్తదానం, పండ్లు పంపిణీ, కేక్ కటింగ్ కార్యక్రమాల నిర్వహణ