మలక్పేట, మే 9: ప్రముఖ వాణిజ్య, వ్యాపార, విద్యా కేంద్రమైన దిల్సుఖ్నగర్లో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రజలు, పాదచారులకు దూరంగా ఉన్న యూటర్న్ వద్దకు రోడ్డు దాటాల్సిన పరిస్థితి తప్పనున్నది. మెట్రో నిర్మాణ సమయంలో పాదచారుల వంతెనను తొలగించారు. అంతేకాక మెట్రో కారిడార్ పొడవునా రోడ్డు మధ్యలో పిల్లర్లను అనుసంధానం చేస్తూ డివైడర్ గోడలు ఎత్తుగా నిర్మించారు. ఫలితంగా పాచదారులు అవతలి వైపు రోడ్డు దాటేందుకు వీలు లేకుండా పోయింది. పలువురు గోడను దాటే క్రమంలో కిందపడి గాయాల పాలయిన సంఘటనలు ఉన్నాయి. మరికొందరు అక్కడక్కడా ఏర్పాటు చేసిన దూరాన ఉన్న యూటర్న్ వద్దకు వెళ్లి రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పరిష్కారంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల ఆధ్వర్యంలో రూ.3.95 కోట్లతో జాతీయ రహదారిని దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనులను ఆర్ఈ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారు. బ్రిడ్జి నిర్మాణంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దివ్యాంగులు, వయో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలకోసం ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు.