సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ) : ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోన్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్మార్కెట్లు, ఐస్ క్రీం పార్లర్లు ఇతర వాటిపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగానే నారాయణగూడలోని ఇండియన్ దర్బార్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. వంటగదిలో అప్రరిశుభమైన వాతావరణం, బొద్దింకల బెడద ఉన్నట్లు గుర్తించారు.
కుళ్లిన టామోటా, పచ్చిమిర్చి, క్యారెట్లు, సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు తేల్చారు. మసాలా ఫౌడర్ (మూడు ప్యాకెట్లు), జీలకర్ర పొడి (3.5 కిలోలు) ఇతర వస్తువులు గడువు ముగిసినట్లు గుర్తించి వాటిని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. లక్డీకపూల్లోని హోటల్ అశోకలో అధికారులు తనిఖీ చేయగా వంటగది గోడలు అపరిశుభ్రంగా ఉండడం, దుర్వాసన వస్తుండడాన్ని గమనించారు. బొద్దింకల తాకిడి, ఫ్రిజ్లో ఉన్న పాత్రలు తుప్పు పట్టినట్లు గుర్తించారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడినట్లు తేల్చారు. కుళ్లిపోయిన బెండకాయలు, క్యాలీఫ్లవర్ను గుర్తించి వాటిని పారబోశారు. గడువు ముగిసిన వస్తువులు, కర్రీ కట్ చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.