హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల పాలిట మృత్యు కూపాలుగా మారుతున్నాయి. అరకొర వసతులు, కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మాదాపూర్లోని చందా నాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గమనించిన పాఠశాల సిబ్బంది విద్యార్థులను కొండాపూర్ ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు.
కాగా, బాగ్ లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు. పాఠశాల సిబ్బంది వైద్య చికిత్స నిమిత్తం కింగ్ కోఠి హాస్పిటల్కు తరలించారు.16 మంది విద్యార్థులు కింగ్ కోటి హాస్పిటల్కు తరలించగా, మరో ఆరు మందిని నిలోఫర్ హాస్పిటల్కు తరలించి వైద్యం అందించారు. కాగా, ఈ విషయంపై కింగ్ కోఠి మెడికల్ సూపరింటెండెంట్ సంతోష్ స్పందించారు. విద్యార్థులు రాత్రి వారు తిన్న ఆహారం కలుషితం కావడం వల్ల వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్నారు. డీహైడ్రేషన్ కారణంగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు అందరి కండిషన్ స్టేబుల్గా ఉందని, పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.