తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే జానపద, గిరిజన సాహిత్యానికి, పాటలకు సముచిత స్థానం దక్కుతుందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఆర్.సత్యనారాయణ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నృత్యభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ మల్లేష్ తల్వార్ సేకరించిన ‘తెలంగాణ ప్రజల సామెతలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ భాషకు, యాసకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గౌరవం ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ సామెతలను సుమారు 4వేలకు పైగా సేకరించి పుస్తక రూపంలోకి తీసుకువచ్చి తెలంగాణ సమాజానికి చేరువచేయడం అభినందించదగిన విషయమన్నారు. కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి రాజర్శి షా, గ్రామీణాభివృద్ధి శాఖ సంగారెడ్డి డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.