బోయిన్పల్లి నుంచి కొంపల్లి నేషనల్ హైవేలో.. రూ.446.18 కోట్ల వ్యయంతో నిర్మాణం
నగర శివారులో నిజామాబాద్ జాతీయ రహదారి (ఎన్హెచ్44)పై పద్మవ్యూహాన్ని తలపిస్తున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. త్వరలోనే బోయిన్పల్లి నుంచి సుచిత్ర చౌరస్తా మీదుగా కొంపల్లి వరకు రూ.446.18 కోట్ల వ్యయంతో సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో నాలుగు ఫ్లైఓవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నది. పెరుగుతున్న జనాభాతో పాటు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్రాజు గురువారం మంత్రి కేటీఆర్ను కలిసి కోరడంతో వెంటనే స్పందించారు. ఫ్లై ఓవర్ల నిర్మాణంతో పాటు జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు.
కుత్బుల్లాపూర్, జూలై 14 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి పనులు, పలు ప్రతిపాదనలపై నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్రాజు గురువారం రాష్ట్ర పురపాలక శాఖమంత్రి కేటీఆర్ను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సుదీర్ఘంగా చర్చించారు. బోయిన్పల్లి నుంచి సుచిత్ర మీదుగా కొంపల్లి వరకు సుమారు 10కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు 5 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రూ.446.18 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. బోయిన్పల్లి నుంచి సుచిత్ర చౌరస్తా, జీడిమెట్ల గ్రామం చౌరస్తా, దూలపల్లి చౌరస్తా, కొంపల్లిలో మొత్తం నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రూపొందించిన ప్రతిపాదనల్లో భాగంగా పనులు చేపట్టాలని కోరారు. అంతేకాకుండా జంక్షన్ల అభివృద్ధితో పాటు రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులతో మాట్లాడి ఫ్లై ఓవర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా రోడ్డు విస్తరణ, జంక్షన్ల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలని, సకాలంలో పనులు మొదలుపెట్టాలని అధికారులకు సూచించారు.
సుభాష్నగర్ డివిజన్లోని కేకే ఓనర్ సొసైటీతో పాటు దూలపల్లిలో ఉన్న ఇండస్ట్రియల్ నుంచి మున్సిపాలిటీలకు పెద్దమొత్తంలో పన్నులు వస్తున్నాయని, ఆ ఏరియాలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మంత్రి కేటీఆర్కు వివరించారు. టీఎస్ఐఐసీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో అసంపూర్తిగా ఉన్న నీటి పైపులైన్లను మెరుగుపర్చేందుకు రూ.15 కోట్లు మంజూరు చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ సకాలంలో సమస్యలను పరిష్కరించడంతో పాటు.. నియోజకవర్గాన్ని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత సాధికారిత పథకంతో దళితుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతిపాదనలను త్వరలోనే పూర్తిచేసేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. శివారు మున్సిపాలిటీలలో మంచినీటి సౌలభ్యం కోసం రూ.1200 కోట్లను మంజూరు చేయడం పట్ల మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కృతజ్ఞతలు తెలిపారు