సిటీబ్యూరో, జూన్ 8(నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో వరద కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం చర్యలను వేగిరం చేసింది. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో వరద ముంపు సమస్య పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలకు నడుం బిగించింది. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన సర్కార్ నాలాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా భారీ ప్రణాళికల రూపకల్పన చేసింది. ఇందులో భాగంగానే వరద నీరు సాఫీగా మూసీలోకి వెళ్లేలా తక్షణ చర్యలకుగాను ప్రభుత్వం రూ. 858కోట్లు మంజూరు చేసింది.
చెరువులు, కుంటలు, తూముల అభివృద్ధి, తదితర పనులతో పాటు నాలాల విస్తరణ, ఆధునీకరణ, వర్షపు నీరు వెళ్లేందుకు మార్గాలు లేని చోట్ల కొత్త నిర్మాణాలు, కుచించుకుపోయిన చోట నాలా విస్తరణ, రహదారి కంటే ఎత్తున్న నాలాను సమతుల్యంగా చేయడం, వరద నీటి కాల్వల బలోపేతం కోసం అధికారులు డిటెల్ట్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లు సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో రూ.609 కోట్ల అంచనాలో కొన్ని ఫ్యాకేజీలకుగాను రూ. 267.07కోట్ల పనులకు డీపీఆర్లు సిద్ధం చేసి టెండర్ల దశకు తీసుకువచ్చారు. ఈ పనులను శరవేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతూనే మరోపక్క పెండింగ్లో ఉన్న ఫ్యాకేజీలకు డీపీఆర్ రూపకల్పన చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా అన్ని ఫ్యాకేజీల పనులను పట్టాలెక్కించునున్నారు. గొలుసుకట్టు చెరువులన్నింటిని అనుసంధానించి.. చెరువుల్లోకి మురుగు చేరకుండా ఉండటంతో పాటు వరద నీరు సాఫీగా మూసీలోకి వెళ్లేలా చర్యలు తీసుకోనున్నారు.
మొత్తం 15 ప్యాకేజీలకుగాను రూ. 858కోట్ల అంచనా వ్యయం ఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 609 కోట్ల పనులకుగాను రూ. 267.07 కోట్ల పనులకు డీపీఆర్లు సిద్ధంచేసి టెండర్లను ఆహ్వానించారు. మిగిలిన ఫ్యాకేజీలకు డీపీఆర్లను సిద్ధం చేస్తున్నారు.