జంట జలాశయాల్లోకి వరద తగ్గుముఖం పట్టడంతో మూసీనది శాంతించింది. గురువారం ఉస్మాన్సాగర్కి 1800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దిగువ మూసీలోకి 6 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 2442 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. హిమాయత్ నగర్కి ఎగువ నుంచి 400 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఒక గేటు అ డుగు మేర ఎత్తి 330 క్యూసెక్కుల నీరు మూసీలోకి చేర్చుతున్నారు. దీంతో నగరంలో అనేక ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గి మామూలు స్థితి నెలకొన్నది.
సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ) /మణికొండ/మలక్పేట, జూలై 28: జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి క్రమంగా వరద తగ్గుముఖం పట్టడంతో మూసీనది నెమ్మదించింది. బుధవారంతో పోల్చితే గురువారం ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాల్లోకి వచ్చే వరద నీటి ప్రవాహం తగ్గింది. ఈ నేపథ్యంలో ఉస్మాన్సాగర్కు 1800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దిగువ మూసీలోకి ఆరు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 2442 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. హిమాయత్నగర్కు ఎగువ నుంచి 400 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఒక గేటు అడుగు మేర ఎత్తి 330 క్యూసెక్కుల నీరు మూసీలోకి పంపుతున్నారు. జంట జలాశయాల నుంచి 2772 క్యూసెక్కుల నీరు మూసీలోకి పంపుతున్నామని, మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు.
దిగ్బంధంలో మంచిరేవుల
గండిపేట చెరువు గేట్లు ఎత్తివేసినప్పటి నుంచి నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో లాక్డౌన్ విధించినట్లుగానే మారిపోయింది. ఇక్కడి నివాసితులు బయటకు వెళ్లాలంటే మూసీకాలువ దాటాల్సి ఉంటుంది. అక్కడ నుంచే నార్సింగి వచ్చి నగరానికి వెళ్లాల్సిన పరిస్థితి. కాగా, రెండు రోజుల కిందట చెరువు గేట్లు ఎత్తివేయడంతో ఆ గ్రామస్తులు బయటకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
మూసారం బాగ్ వద్ద..
మూసీలో వరద తగ్గుముఖం పట్టడంతో మూసారంబాగ్ బ్రిడ్జిపై గురువారం వరద తగ్గి బ్రిడ్జి తేలింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది బ్రిడ్జిపై పేరుకుపోయిన బురద, చెత్తా, చెదారాన్ని తొలగిస్తూ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. తీగలగూడ ప్రధాన రహదారిపై కూడా బురదను తొలగించారు. పునరుద్ధరణ పనులను డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి, సికింద్రాబాద్ జోన్ జెడ్సీ శ్రీనివాస్రెడ్డి, సౌత్జోన్ సర్కిల్ డీసీ జయంత్ తదితరులు పర్యవేక్షించారు.
శాశ్వత పరిష్కారం కోసం..
మూసారం బాగ్లో రూ.52 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించనున్నట్లు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి తెలిపారు. మూసారం బాగ్ బ్రిడ్జిని సందర్శించి, పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. తరచూ వరద ప్రవాహాలకు గురై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నందున సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ జూలై 5న రూ.52 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాలైన చూడీ బజార్, చాదర్ఘాట్, మూసారం బాగ్ ప్రాంతాల్లో పర్యటించి పునరుద్ధరణ పనులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ శ్రీనివాస్రెడ్డి, అంబర్పేట కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్, డీసీ తదితరులు పాల్గొన్నారు.