మహిళల ఆర్థిక వృద్ధి, భద్రత, స్వచ్ఛమైన ఆలోచనలకు ప్రతిరూపంగా కేబీఆర్ పార్కు ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లయిట్ శిలా రూపాన్నిఆదివారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన ఈ శిల్పంతో కేబీఆర్ పార్కుకే మరింత వన్నె వచ్చిందని ఆమె కొనియాడారు.
సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: ఎన్నో సామాజిక సేవలు చేసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని.. ఇప్పుడు చేస్తున్న పనితో ఎంతో సంతృప్తిగా ఉన్నానని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. నగరానికి చెందిన ప్రముఖ దాతృత్వవేత్త పింకీరెడ్డి, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చైర్పర్సన్ శుభ్రామహేశ్వరితో కలిసి ఆదివారం కేబీఆర్ పార్కులో మహిళా శక్తికి గుర్తుగా ఏర్పాటు చేసిన ‘ఫ్లయిట్’ను ఆమె ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్తో ఎంతోకాలంగా అనుబంధం ఉందని.. ఈ సంస్థతో కలిసి పని చేయాలనుకుంటున్నా.. సమయాభావంతో ఆగిపోవాల్సి వస్తుందని అన్నారు. భవిష్యత్లో ఫిక్కీలో చేరి సామాజిక కార్యక్రమాలు చేస్తానని వివరించారు.
కేబీఆర్ పార్కు ఎదుట ఏర్పాటు చేసిన శిల్పం అద్భతంగా ఉందని.. ఈ శిల్పం మహిళా సంరక్షణ, దేవదూతకు ప్రాతినిధ్యం వహిస్తున్నదనడంలో ఆశ్చర్యం లేదన్నారు. మహిళా యోధురాలి రూపంలో ఉన్న శిల్పం మహిళా బలం, భద్రత, స్వచ్ఛమైన ఆలోచనలకు ప్రతిరూపంగా ఉందన్నారు. తెలంగాణలో మహిళాశక్తిని ప్రోత్సహించడంలో సహకరించిన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రాష్ట్ర ప్రభుత్వానికి శుభ్రా మహేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.