మన్సూరాబాద్, ఏప్రిల్ 13: వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. రోడ్డుపక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు వృద్ధులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా, చిలకూరు మండలం, బేతవోలు గ్రామానికి చెందిన సడే వీరయ్య(78), హయత్నగర్, సూర్యానగర్కాలనీకి చెందిన సుంకర మొగ్గయ్య(60), సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం, నయనగార్ గ్రామానికి చెందిన సడే జగదీశ్ (49) అనే ముగ్గురు బంధువులు. వీరిలో సడే వీరయ్య, జగదీశ్లు అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రిలో చూపించేందుకు శుక్రవారం రాత్రి నగరంలోని హయత్నగర్, సూర్యానగర్కాలనీలో నివాసముండే సుంకర మొగ్గయ్య ఇంటికి వచ్చారు.
అయితే వీరిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చూపించేందుకు శనివారం ఓలా కారులో సడే వీరయ్య, సుంకర మొగ్గయ్య, సడే జగదీశ్ బయలుదేరారు. అయితే ఉదయం 6 గంటలకు సరూర్నగర్ ఇండోర్స్టేడియం సమీపంలోని ప్రభుత్వ పెట్రోల్ బంకు వద్ద ఓ లారీ డ్రైవర్ నడి రోడ్డుపై లారీని నిలిపాడు. ఇది గమనించని క్యాబ్ డ్రైవర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మొగ్గయ్య అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన వీరయ్యను ఎల్బీనగర్లోని కామినేని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన జగదీశ్ను, ఓలా క్యాబ్ డ్రైవర్ను వనస్థలిపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన మొగ్గయ్య, వీరయ్య మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుడు వీరయ్య బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.