ప్రభుత్వ పరిశీలనలో డీపీఆర్లు.. పరిపాలన అనుమతులు రాగానే పనులు
వ్యూహాత్మక దారులతో.. నగర వాసులకు ఊరట
ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తికి జీహెచ్ఎంసీ మరిన్ని చర్యలు
5 ఫ్లై ఓవర్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ అడుగులు
ప్రభుత్వ పరిశీలనలో డీపీఆర్లు
ఐదు ఫ్లైఓవర్లు ఇవే..
1. కూకట్పల్లి వై జంక్షన్లో ఇరువైపులా నాలుగు లేన్లతో
2. రేతిబౌలి, నానక్రాంగూడ జంక్షన్లో..
3. జూబ్లీహిల్స్ చెక్పోస్టులో..
4. చాంద్రాయణగుట్ట ఓమర్ హోటల్ జంక్షన్లో..
5. పాతనగరంలోని బండ్లగూడ జంక్షన్లో..
ఏడేండ్ల కిందటి వరకు వ్యూహంలేని రహదారులతో పద్మవ్యూహాన్ని తలపించే ట్రాఫిక్తో భాగ్యనగరి వాసులు చుక్కలు చూశారు. గమ్యం చేరాలంటే గంటల సమయం పట్టేది. ఇంధన ఖర్చు తడిసి మోపెడయ్యేది. కానీ స్వరాష్ట్రంలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
హైదరాబాద్ ట్రాఫిక్ ఓ పద్మవ్యూహం. ఇది ఒకప్పటి మాట. వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ) ద్వారా ఈ ట్రా‘ఫికర్’కు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. నగరాన్ని సిగ్నల్ ఫ్రీగా మార్చేందుకు తొలిదశలో రూ. 8052.92 కోట్ల వ్యయంతో 47 చోట్ల పనులు చేపట్టారు. ఇందులో 12 చోట్ల ఫ్లై ఓవర్లు, ఐదు అండర్పాస్లు, ఆరు ఆర్వోబీలు/ఆర్యూబీలు, ఒక కేబుల్ బ్రిడ్జి, పంజాగుట్ట బ్రిడ్జి పనులు చేపట్టగా, రూ.2497.95కోట్ల విలువ గల పనులను పూర్తి చేసి 27 చోట్ల ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి కల్పించారు. మరో 20 చోట్ల పనులు తుది దశకు చేర్చారు. తాజాగా మరో ఐదు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ అడుగులు వేసింది. ఇప్పటికే డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. పరిపాలన అనుమతి రాగానే పనులు చేపట్టనున్నట్లు ఇంజనీరింగ్ విభాగం తెలిపింది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): భాగ్యనగరిలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ) కింద రూ.8052.92కోట్ల వ్యయంతో 47 చోట్ల పనులు చేపట్టేందుకు నిర్ణయించగా.. ఇందులో రూ.2497.95కోట్ల వ్యయంతో 12చోట్ల ఫ్లై ఓవర్లు, ఐదు అండర్పాస్లు, ఆరు ఆర్వోబీలు/ఆర్యూబీలు, ఒక కేబుల్ బ్రిడ్జి, పంజాగుట్ట బ్రిడ్జి పనులను పూర్తిచేసి 27 చోట్ల ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించారు. మరో 20 చోట్ల పనులు తుది దశకు చేరుకున్నాయి.
రద్దీ ప్రాంతాలను గుర్తించి..!
ఎస్ఆర్డీపీ పనులతో హైటెక్సిటీ, గచ్చిబౌలి, మెహిదీపట్నం, మాదాపూర్, బాలానగర్, ఎల్బీ నగర్, పాతనగరం తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టారు. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని చీల్చుకుంటూ వచ్చిన వ్యూహాత్మక దారులతో నగరవాసులు ఊరట పొందారు. ఇందులో భాగంగానే రద్దీగా మారిన మరో ఐదు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ అడుగులు వేసింది.
పరిపాలన అనుమతి రాగానే పనులు చేపట్టనున్నట్లు ఇంజినీరింగ్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.