అమీర్పేట్, జనవరి 12 : గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా.. గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఫతేనగర్ శివశంకర్ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సనత్నగర్ అగ్నిమాపక శాఖ అధికారి ప్రదీప్ తెలిపారు. ఫతేనగర్ శివశంకర్ కాలనీకి చెందిన వెంకటేశ్, ఉమ దంపతులు. వీరింట్లో గురువారం ఉదయం 11 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ను మారుస్తుండగా గ్యాస్ లీక్ అయ్యింది. వెంటనే సిలిండర్ డెలివరీ బాయ్ (ఇండియన్ గ్యాస్) రాజశేఖర్కు సమాచారం ఇచ్చి రప్పించారు.
అతడు మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించాడు. కిచెన్ ప్రదేశం చిన్నదిగా ఉండటంతో గ్యాస్ బాగా వ్యాపించింది. దీంతో అప్పటికే కిచెన్లో వాటర్ హీటర్ ఆన్లో ఉంది. దీంతో ఆందోళనకు గురైన వెంకటేశ్, ఉమ వెంటనే వాటర్ హీటర్ స్విచ్ఛాఫ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి మంటలు వ్యాపించాయి. వెంకటేశ్, ఉమతో పాటు గ్యాస్ తీసుకువచ్చిన రాజశేఖర్కు మంటలంటుకున్నాయి. తప్పించుకునే ప్రయత్నంలో రెయిలింగ్ చిన్నదిగా ఉండటంతో నాగరాజు, పక్కింటికి చెందిన జ్యోతి కిందపడి పోవడంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు గాయపడినట్టు ఎస్ఎఫ్వో ప్రదీప్ తెలిపారు. ఘటనా స్థలాన్ని డీఆర్ఎఫ్ ఎస్ఎఫ్వో శ్యాంసుందర్ సందర్శించారు.