ముషీరాబాద్, జూలై 30 : ముషీరాబాద్ చేపల మార్కెట్కు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం టన్నుల కొద్దీ చేపల విక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో మత్స్య సంపద పెరగడంతో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి చేపలు ఇక్కడకు వస్తాయి. గతంలో ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చేవి. ప్రస్తుతం అది నిలిచిపోయింది. ప్రతి రోజు 20 టన్నులు, ఆదివారం ఆ సంఖ్య రెట్టింపు ఉంటుంది. ఈ ఒక్క రోజే 50 టన్నుల చేపలు మార్కెట్కు వచ్చాయి. ఇక్కడ నుంచే కోల్కత్తా, ముంబై, పుణే తదితర నగరాలకు ఎగుమతులు జరుగుతాయి. నిత్యం వందలాదిగా ఇక్కడ చేపలు కొనుగోలు చేసేందుకు నగరవాసులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వస్తుంటారు. వివాహాది శుభకార్యాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు సైతం ఇక్కడి నుంచే తీసుకెళ్తుంటారు. వివిధ రకాల నాణ్యమైన చేపలు లభిస్తుండటంతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ఏడాది పొడవునా చేపలు లభించడం విశేషం.