మీర్చౌక్ పోలీస్స్టేషన్ పరిధిలోని కాలికబర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి పురాతన భవనం కుప్పకూలింది. అగ్నిమాపక సిబ్బంది 12 మందిని కాపాడగా, వారిలో 17 రోజులున్న ఈ చిన్నారి కూడా ఉంది.
చార్మినార్, సెప్టెంబర్ 19: శిథిలావస్థలో ఉన్న భవనం రెండో అంతస్తులోని ప్రహరీ కూలింది. ఆ భవనంలో చిక్కుకున్న 17 రోజుల చిన్నారితో సహా 12 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడింది. ఈ ఘటన మీర్చౌక్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారుల కథనం ప్రకారం.. కాలికబర్లో ఉన్న రెండు అంతస్తుల పురాతన భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఈ భవనంలో 12 మంది నివసిస్తున్నారు. భవనం శిథిలావస్థలో ఉన్నదని హెచ్చరిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు గత నాలుగేండ్లుగా యజమాని సల్మా సుల్తానాకు నోటీసులు జారీ చేస్తున్నారు.
ఇంటి యజమాని సల్మా సుల్తానా మాత్రం ఎప్పటికప్పుడు భవనానికి మరమ్మతు చేసినట్లు పేర్కొంటూ భవనం ఖాళీ చేయడం లేదు. ఈ భవనం రెండో అంతస్తులో ఉన్న ప్రహరీ ఆదివారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఆ సమయంలో ఇంటి యజమానితోసహా ఇంట్లో 12 మంది ఉన్నారు. వీరిలో 17 రోజుల చిన్నారి కూడా ఉంది. విషయం తెలిసిన వెంటనే మీర్చౌక్ పోలీసులు, మొగల్పుర అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి భవనం రెండో అంతస్తులో చిక్కుకున్న 12 మందిని సురక్షితంగా భవనం పైనుంచి కిందకు తీసుకొచ్చి కాపాడారు. డీఎఫ్ఓ ఎం.శ్రీనివాస్, ఏ ఎఫ్ఓ జి.వేణు ఆదేశాలతో ఎస్ఎఫ్ఓ ప్రేమ్కుమార్ నేతృత్వంలో రాజేశ్వర్, ఎం.వినోద్కుమార్, ఎండి. ఖదీర్, బి.వి.రాజు, కె. లోకేశ్ కుమార్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అందరిని కాపాడినట్లు అధికారులు తెలిపారు.