సికింద్రాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని చంద్రలోక్ కాంప్లెక్స్ ( Chandralok Complex )లో శుక్రవారం అగ్నిమాపక భద్రతా నిబంధనల ఉల్లంఘనపై ఫైర్ శాఖ అధికారులు ( Fire Department ) తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించిన కాంప్లెక్స్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. సికింద్రాబాద్ ఫైర్ బ్రిగేడ్ ఆధ్వర్యంలో జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీదాస్ నేతృత్వంలో అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి ప్రభాకర్ రెడ్డి , స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్ తన సిబ్బందితోకలిసి తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సందర్భంగా భవనంలో అగ్నిమాపక భద్రతకు సంబంధించిన కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని గుర్తించారు. సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని, భవనం నుంచి పెచ్చులు ఊడిపడుతున్న పరిస్థితి ఉందని అధికారులు తెలిపారు. ఈ అంశాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతామని వెల్లడించారు.
భవనంలోని విద్యుత్ వైరింగ్ పూర్తిగా పాతబడిపోయి ప్రమాదకర స్థితిలో ఉందని తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా బయటకు రావడానికి అవసరమైన వెడల్పు మెట్లు లేవని, భవనం చుట్టూ అవసరమైన సెట్బ్యాక్ స్థలం లేదని వెల్లడించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత దృష్ట్యా భవన నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.