Fire Breaks | మైలార్దేవ్పల్లి, జూలై 3: ప్రమాదవశాత్తు ఓ రబ్బర్ పరిశ్రమలో మంటలు చెలరేగిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్కు చెందిన అనిల్ సురేఖ కాటేదాన్లోని నేతాజీనగర్లో రబ్బర్ కంపెనీని ఏర్పాటు చేసుకోని నిర్వహిస్తున్నాడు. ఉదయం 4.30 ప్రాంతంలో పరిశ్రమలో మంటలు చెలరేగుతున్నట్లు స్థానికులు గమనించి అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో సంఘటన స్థలానికి చేరుకోని దాదాపు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షాట్సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.