జూబ్లీహిల్స్, ఆగస్టు 30: తప్పటడుగులు వేసే పిల్లలను సన్మార్గాన నడిపించి, గోరుముద్దలు తినిపించి అమ్మ నేడు ఆ కన్న కొడుకులకు చేదైపోయింది. బుడిబుడి అడుగులు నేర్పించిన అమ్మ ఆస్తిపాస్తులు అడిగిందని ఆగర్భ శత్రువయ్యింది. చివరికి ఆ వృద్ధురాలికి పొట్ట పోసుకునేందుకు యాచకవృత్తే దిక్కయ్యింది. రహ్మత్నగర్లో కూరగాయల కమలమ్మ అంటే తెలియని వారుండరు. పెద్ద కూతురును.. ఇద్దరు కొడుకులను చంకనేసుకుని బతుకు దెరువు కోసం 40 ఏండ్లక్రితం నగరానికి వలసవచ్చింది. భర్త ప్రైవేట్ ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలలో పనిచేస్తుంటే, తాను కూరగాయల వ్యాపారం చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు రహ్మత్నగర్ కూరగాయల మార్కెట్లో ఆమెకు రెండు మడిగెలు, రహ్మత్నగర్లో రెండు సొంత ఇండ్లు ఉన్నా.. ఆమెకు ఎవ్వరూ దిక్కు లేక జీటీఎస్ ఆలయం ముందు అడుక్కుంటూ.. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తోంది.
అమ్మకు మతి భ్రమించినదన్న నెపంతో అమ్మను దూరం పెట్టారు కొడుకులు. పెద్ద కూతురు వివాహం కాక ముందే మరణించగా, పక్షవాతంతో మూలకుపడ్డ భర్త కొడుకుల పంచనే ఉండటంతో వృద్ధాప్యంలో ఆమె ఏకాకి అయ్యింది. ఇంట్లో భార్యతో గొడవ పడిందని.. తండ్రికి అనారోగ్యం వస్తే పట్టించుకోలేదన్న సాకుతో కొడుకులు ఆమెను వదిలేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన అమ్మకు రెండు నెలలు జీవనోపాధికి డబ్బులు ఇచ్చిన కొడుకులకు ప్రస్తుతం, అది కూడా భారమైంది. దీంతో పొట్ట పోసుకునేందుకు ఇంటి అద్దె కట్టుకునేందుకు ఆ వృద్ధురాలు రెండేండ్లుగా యాచకవృత్తి చేస్తున్నది. తనపై కూరగాయల మార్కెట్లో కిరోసిన్ పోసి హత్యాయత్నం చేశారని కమలమ్మ ఆరోపిస్తుండగా, తమ తల్లి కిరోసిన్ పోసుకుని తమను అభాసుపాలు చేసిందని కొడుకులు పేర్కొంటున్నారు. ఈ అమ్మ విషయం పలుమార్లు పోలీసులు, పెద్ద మనుషుల వద్దకు వెళ్ళినా కమలమ్మకు మాత్రము అన్యాయమే జరిగింది.