ఖైరతాబాద్, డిసెంబర్ 9: ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించేందుకు ఆర్థిక సాయం అందించాలని పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తాను మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం ఉల్లెపల్లి తండాలో వ్యవసాయ కుటుంబంలో జన్మించానని తెలిపారు. తనకు 15 ఏట నుంచే పర్వతారోహణపై ఉన్న మక్కువతో సిక్కింలోని ఇండియన్ హిమాలయ్ సెంటర్ఫర్ అడ్వెంచర్ అండ్ ఈకో టూరిజంలో శిక్షణ తీసుకున్నానన్నారు. తాను ఇప్పటి వరకు సౌతాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, రష్యాలోని మౌంట్ ఎలబ్రస్, హిమాచల్ప్రదేశ్లోని మౌంట్ యూనాం, మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపు, జమ్మూకశ్మీర్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించానని చెప్పారు. తాజాగా ఈనెల 1న ఆస్ట్రేలియాలోని సముద్రమట్టానికి 7,310 ఫీట్ల ఎత్తులో ఉన్న మౌంట్ కోజిస్కోను ఎక్కినట్లు తెలిపారు.
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో అన్ని పర్వతాలను అధిరోహించాలన్నది తన లక్ష్యమన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్టు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నానని, అయితే ఆ ఫీట్ను పూర్తి చేసేందుకు సుమారు రూ. 40 లక్షలు ఖర్చవుతుందన్నారు. గిరిపుత్రుడనైన తనకు మౌంట్ ఎవరెస్టును అధిరోహించేందుకు ప్రభు త్వం ఆర్థిక సాయం అందించాలని కోరాడు. అనంతరం యశ్వంత్నాయక్ను గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బునాయక్, ప్రధాన కార్యదర్శి విజయ్ నాయక్, చీఫ్ కో ఆర్డినేటర్ రమేశ్ రాథోడ్, పారిశ్రామికవేత్త రామునాయక్, తదితరులు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.