హైదరాబాద్ : మన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొగల్పురాలోని శ్రీ జగదాంబ ఆలయం వద్ద 310 దేవాలయాలకు బోనాల ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల 24 న హైదరాబాద్ బోనాలు, 25 న ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఉంటుందన్నారు. బోనాలు గొప్పగా జరపాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. అలాగే 100 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీ, సీవరేజ్ వంటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
ఢిల్లీలో, విజయవాడలో కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల నిర్వహించామని ఆయన తెలిపారు. ఓల్డ్ సిటీలో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం ఎప్పుడు చిత్తశుద్ధితో పని చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.