అడ్డగుట్ట, మార్చి 9 : విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వొద్దని, ఉద్యోగులకు వేతనాలు తగ్గించాలని ప్రజా వ్యతిరేకంగా ఉన్న విద్యాకమిషన్ నివేదిక ప్రతులను సోమవారం ఓయూలో బీఆర్ఎస్వీ నాయకులు చింపివేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని సూచించడం పేద విద్యార్థుల పాలిట మరణశాసనమేనని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య అన్నారు.
విద్యా కమిషన్ రిపోర్టును వెంటనే రద్దు చేసి సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఎవరి ఆస్తికాదని, అది పేద విద్యార్థుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూడటం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. నిరసనలో బీఆర్ఎస్వీ నాయకులు కాటం శివ, రామకృష్ణ, శ్రీకాంత్, నాగేందర్ రావు, మేడి పవన్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.