కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 22 : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో పసందైన భోజనాలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. హైటెక్సిటీ హెచ్ఐసీసీ ప్రాంగణంలో ఈనెల 27న జరుగనున్న టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీ సమావేశ భోజన ఏర్పాటు పనులను ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్లు శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హెచ్ఐసీసీ ప్రాంగణంలో పురుషులు, మహిళలు, మీడియా, పోలీస్ విభాగాలకు ప్రత్యేక క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సభకు హాజరు కానున్న ఐదువేల మంది ప్రజా ప్రతినిధులకు ఎలాంటి లోటు లేకుండా భోజన ఏర్పాట్లను చేయనున్నట్లు తెలిపారు. భోజన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గం కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నేతలున్నారు.