సీఎం కేసీఆర్ నాయకత్వంపై ఉన్న విశ్వాసం.. రాజకీయ ప్రత్యర్థులను ఏకం చేస్తున్నది. విపక్ష పార్టీల్లో ఒకే పార్టీలో ఉన్న నాయకులు గ్రూప్ రాజకీయాలు చేస్తుండగా, కారు పార్టీలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. ప్రత్యర్థులుగా గత ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు నేడు ఒకే కారులో కనిపిస్తున్నారు. హ్యాట్రిక్ సర్కారే లక్ష్యంగా ఎన్నికల ప్రచార పర్వంలో బిజీ బిజీ అయ్యారు. కారు గుర్తుకు ఓటేయాలని కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనిపించిన దృశ్యం. మాజీ ఎమ్మెల్యే విష్ణు, ఎమ్మెల్యే మాగంటి సోమవారం కలిసి బోరబండలో ప్రచారంలో పాల్గొన్నారు.
ఎర్రగడ్డ, నవంబర్ 6: సుస్థిర పరిపాలనతో పాటు పేద వర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం ఆయన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి బోరబండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాగంటి మాట్లాడుతూ.. కాంగ్రెస్ చెప్పే మాయమాటలను నమ్మి మోసపోవద్దని.. పదేండ్లలో చేసిన అభివృద్ధిని చూసి నిర్ణయం తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో డివిజన్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. ప్రచారంలో అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించడం విశేషం. ప్రచారంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సిరాజ్, లక్ష్మణ్గౌడ్, మధుసూదన్, ఆనంద్, జైభీమ్ యాదగిరి పాల్గొన్నారు.