Hyderabad | చార్మినార్, జూన్ 20: ముగ్గురు స్నేహితుల మధ్య ఏర్పడిన స్వల్ప వివాదమే ఓ స్నేహితుడి హత్యకు దారి తీసిందని ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ తెలిపారు. గతవారం బహదూర్ఫుర పోలీస్స్టేషన్ పరిధిలోని దానమ్మజోపిడి ప్రాంతంలో జరిగిన హత్య కేసు మిస్టరీని టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి ఛేదించారు. ఈ కేసు వివరాలను విలేకరుల సమావేశంలో ఏసీపీ షేక్ జహంగీర్ వెల్లడించారు. కాలాపత్తర్ పరిధిలోని రంజన్ కాలనీకి చెందిన షేక్ ఖాసీం అలియాస్ అషు (35), సయ్యద్ యూసుఫ్, సయ్యద్ ఫజల్ స్నేహితులు. ముగ్గురూ కూలీ పనులు చేస్తూ రోజు సాయంత్రం కల్లు కంపౌడ్ వద్ద కలుసుకుంటారు. మద్యం తాగిన తర్వాత ఖాసీం తన మాటలతో యూసుఫ్ (38) సయ్యద్ ఫజల్ (23)పై పెత్తనం చేలాయిస్తూ దూషించాడు.
అప్పుడప్పుడు వారి వద్దనున్న నగదును సైతం ఖాసీం బలవంతంగా లాక్కొని బెదిరించాడు. ఖాసీం రోజురోజుకు వారిపై దాడిచేస్తూ మానసికంగా హింసించాడు. దీంతో యూసుఫ్, ఫజల్ అతడిపై పగ పెంచుకున్నారు. ఎలాగైనా ఖాసీంకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా గతవారం ముగ్గురు కలిసి మీర్ ఆలం ఫిట్లర్ సమీపంలోని ఓ ప్రాంతానికి చేరుకుని మద్యం తాగారు. ఖాసీం మద్యం మత్తులోకి జారుకోగానే యూసుఫ్ అతడిపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత బండరాయితో ఖాసీం తలపై మోది హత్య చేశారు.
దానమ్మ జోపిడీ ప్రాంతంలో నివసించే ఖాసీం సోదరుడి స్నేహితులు విషయాన్ని గ్రహించి ఫోన్లో సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఖాసీం కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఖాసీం మృతి చెందాడు. ఖాసీం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఏసీపీ తెలిపారు. దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం ఉదయం తాడ్బన్ వద్ద ఖాసీంను హత్య చేసిన నిందితులు ఉన్నారనే విశ్వసనీయ సమచారంతో బహదూర్పుర పోలీసులతో కలిసి నిఘా పెట్టి, నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో బహదూర్పుర, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు సుధాకర్, సంతోష్తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.