నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్ట్తో కదులుతున్న డొంక
జూబ్లీహిల్స్లో ఖరీదైన స్థలం ఆక్రమణకు పథకం
గుంటూరులో అరెస్టు.. నగరంలో లీలలు బయటకు
నిఘా వర్గాల విచారణ ప్రారంభం
బాధితులు భారీగా బయటకు వచ్చే అవకాశం
బంజారాహిల్స్, ఏప్రిల్ 10 : జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన పత్రాలు మాయమయ్యాయంటూ పోలీసులను దబాయిస్తూ.. ప్రధాని కార్యాలయంలో నేరుగా మాట్లాడతానంటూ బెదిరిస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన్నవారంతా తనకు సన్నిహితులే అంటూ బుకాయిస్తూ..ఖరీదైన కారులో తిరుగుతూ జనాన్ని మోసం చేసేందుకు ఐఏఎస్ అవతారం ఎత్తిన ఓ ఘరానా మోసగాడిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే నకిలీ ఐఏఎస్ అధికారి ప్రముఖులపేర్లు చెప్పుకుంటూ జూబ్లీహిల్స్లో ఓ ఖరీదైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు నిఘా వర్గాల విచారణలో వెల్లడైంది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని వికాస్నగర్కు చెందిన తెలదేవులపల్లి వెంకటలక్ష్మి నర్సింహామూర్తి (50) అలియాస్ టీవీఎల్ఎన్. మూర్తి పీజీ చదివాడు. హైదరాబాద్, బెంగళూరు. ముంబై, చెన్నై, ఢిల్లీ తదితర నగరాల్లో తిరుగుతూ ఐఏఎస్ అధికారిని అంటూ జనాన్ని నమ్మించాడు. దేశరక్షణకు సంబంధించిన పలు అంశాల్లో కీలకపాత్ర పోశిస్తున్నానని, భారత ప్రధానితో సహా దేశంలోని ముఖ్యులంతా తనకు పరిచయస్తులే అంటూ చెబుతుంటాడు. ఈ క్రమంలో గుంటూరులోని నల్లపాడులో ఓ యువతి పెళ్లి ఆపేందుకు రంగంలోకి దిగిన టీవీఎల్ఎన్.మూర్తి తాను ఐఏఎస్ అధికారిని అంటూ అక్కడి పోలీసులకు ఫోన్లు చేశాడు. పలువురు పోలీసు ఉన్నతాధికార్ల పేర్లు చెప్పి వెంటనే సిబ్బందితో వెళ్లి సదరు యువతి పెళ్లి ఆపాలంటూ ఒత్తిడి తీసుకువచ్చాడు. అతడి వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు వాకబు చేయగా అతడు నకిలీ ఐఏఎస్ అని తేలింది. దీంతో శనివారం గుంటూరు పోలీసులు మూర్తితో పాటు అతడి పీఏగా చెప్పుకునే గన్నవరపు వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తీగలాగితే కదిలిన డొంక..
ఐఏఎస్ను అంటూ చెప్పుకుని మోసాలకు పాల్పడుతూ గుంటూరు పోలీసులకు చిక్కిన టీవీఎల్ఎన్.మూర్తి వ్యవహారం వెలుగులోకి రావడంతో జూబ్లీహిల్స్లో ఆయన లీలలు బయటకు వచ్చాయి. జూబ్లీహిల్స్ రోడ్ నం 9లో సుమారు రూ.30కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేసేందుకు జనవరి 6న పథకం వేశాడు. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న వరప్రసాద్ అనే వ్యక్తి అద్దె సరిగా చెల్లించకపోవడంతో గదిలో ఉన్న సామాన్లను బయటపెట్టిన ఇంటి యజమాని వేరేవాళ్లకు అద్దెకు ఇచ్చాడు. అయితే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న నకిలీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనర్సింహమూర్తి తన స్నేహితుడు వరప్రసాద్ ఆఫీసులో జాతీయ భద్రతకు సంబంధించిన అనేక పత్రాలు, ల్యాప్టాప్లను తాను భద్రపరిచానంటూ హంగామా సృష్టించాడు. వరప్రసాద్ పేరుతో ఇంట్లోకి ప్రవేశించి కబ్జా చేసేందుకు ఉన్నతస్థాయి అధికారుల పేర్లతో ఇంటి యజమానిని బెదిరింపులకు గురిచేశాడు.
ఇస్రోలో జరుగుతున్న ప్రయోగాలకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని, ప్రధాని కార్యాలయానికి మాత్రమే తెలిసిన అనేక రహస్యపత్రాలు ఇంట్లో ఉన్నాయంటూ వీరంగం సృష్టించాడు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అతడి వ్యవహారశైలిపై నమ్మకం కుదరకపోవడంతో పాటు ఈ వ్యవహారం సివిల్ పంచాయతీగా తేలడంతో లక్ష్మీనర్సింహమూర్తి ఫిర్యాదును పక్కన పెట్టారు. గుంటూరులో లక్ష్మీనర్సింహమూర్తి పట్టుబడటంతో హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో అతడు చేసిన మోసాలపై దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. గవర్నర్ కార్యాలయం, ప్రధాని కార్యాలయం, పోలీసు ఉన్నతాధికారుల పేర్లతో సిఫార్సు లేఖలు సృష్టించి పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బాధితుల వద్దనుంచి డబ్బులు వసూలు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడి వ్యవహారం బట్టబయలు కావడంతో బాధితులు భారీగా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది.