ఉప్పల్, ఏప్రిల్ 27 : బార్కోడ్ను కాపీచేసి నకిలీ ఐపీఎల్ టికెట్లను తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేసి 68 నకిలీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ పోలీస్స్టేషన్లో గురువారం మల్కాజిగిరి ఏసీపీ నరేశ్ రెడ్డి, ఉప్పల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి వివరాలు వెల్లడించారు. నాచారం ప్రాంతానికి చెందిన కె.గోవర్ధన్రెడ్డి ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వెండర్ ఏజెన్సిలో సబ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అఖిల్ అహ్మద్, వంశీ, శ్రవణ్కుమార్, ఇజాజ్ను వ్యాలిడేటర్గా నియమించారు. వీరికి జారీ చేసిన అక్రిడిటేషన్కార్డులోని బార్కోడ్ను కాపీ చేసి నకిలీ ఐపీఎల్ టికెట్లను తయారు చేయడానికి పథకం వేశారు.
చిక్కడపల్లిలోని జిరాక్స్ దుకాణంలో తయారు చేయడానికి తార్నాకలో ముద్రణ చేసిన టెంప్లేట్ను అందించారు. ఏప్రిల్ 18న జరగాల్సిన మ్యాచ్ కోసం నకిలీ టికెట్లను 200 వరకు తయారు చేశారు. నకిలీ టికెట్ల విక్రయాలు, తయారీలో భాగస్వామ్యులైన నాచారం ప్రాంతానికి చెందిన కోమటిరెడ్డి గోవర్ధన్రెడ్డి(22), హిమాయత్నగర్కు చెందిన అఖీల్ అహ్మద్(23), రాంనగర్కు చెందిన వంశీ(22), బహదూర్పురకు చెందిన ఫహీం(21), చెంగిచెర్లకు చెందిన శ్రవణ్కుమార్(22), హిమాయత్నగర్కు చెందిన మహ్మద్ ఇజాజ్(23)లను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకొని, అరెస్టు చేశారు. వారినుంచి నకిలీ టికెట్లు, సెల్ఫోన్లు, సీపీయూ, హర్డ్డిస్క్, మానిటర్, ప్రింటర్, అక్రిడిటేషన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై బి.నెహ్రూ, తదితరులు ఉన్నారు.