సిటీబ్యూరో, జూన్ 23(నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన రంగురాళ్ల మురళీ కృష్ణ భాగోతం ఆసక్తిని రేపుతోంది. పోయింది బొమ్మ కరెన్సీ అయినా.. ఖరీదైన రంగురాళ్లు పోయాయని ఫిర్యాదుపై ఆరా తీయడంతో ఊహించని ట్విస్టులు బుధవారం వెలుగులోకి వచ్చాయి. బొమ్మనోట్లను అసలు కరెన్సీగా భావించి మురళీ కృష్ణ ఇంట్లో చోరీ చేసిన ఆరుగురు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు…తప్పుడు ఫిర్యాదు చేసినందుకు మురళీకృష్ణను రాచకొండ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అతడిని విచారిస్తే ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ గోల్మాల్లో ఏపీలో ఏడాది కిందట అరెస్ట్ అయ్యి.. జైలు నుంచి విడుదలయ్యి తన మకాన్ని హైదరాబాద్కు మార్చాడని తెలిసింది. ఇలా అనేక మందిని బొమ్మ కరెన్సీతో మాయ చేసి.. విలాసవంతంగా జీవితం గడిపాడని, ఈ బొమ్మ కరెన్సీని బేగంబజార్లో కొనుగోలుచేసి.. ఒక్క బొమ్మ కరెన్సీ నోటుకు రూ.25 చొప్పున ఖర్చు చేశాడని పోలీసుల విచారణలో బయటపడింది.
ఈ మధ్య మార్కెట్లో ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ అంటూ బాగా చలామణి అవుతోంది. దీంట్లో సక్సెస్ అయితే కోట్లాది రూపాయలను సంపాదించే అవకాశం ఉండటంతో చాలా మంది నిరుద్యోగులు, చిన్న చిన్న రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేవారు వీటిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీని కోసం చాలా మంది భారీగా కరెంట్ ఖాతాలో నగదు నిల్వ ఉండే వారి కోసం వెదుకుతున్నారు. కరెంట్ అకౌంట్లో రూ.10 కోట్లు ఉంటే.. వాటిని మూడు నెలల నుంచి ఏడాది వరకు హోల్డింగ్ పెడితే.. మరో కంపెనీ 30 శాతం అధికంగా నగదు ఇస్తుంది.
దీని కోసం ముందుగానే ఆ నగదును కరెంట్ అకౌంట్లో ఉన్న ఖాతాలో డిపాజిట్ చేస్తుంది. అయితే.. ఆ ఖాతా నుంచి చిల్లి గవ్వ కూడా వాడొద్దని ఒప్పందం ఉంటుంది. అలా చేస్తే నిల్వ ఉన్న కరెంట్ బ్యాంక్ ఖాతాదారుడికి 30 శాతంలోని 20 శాతం లాభం వస్తుందని, మిగతా 10 శాతం మధ్యవర్తులు పంచుకుంటారని ఒప్పందాలు ఉంటాయని మార్కెట్లో ప్రచారం జరుగుతుంది. మరో వైపు ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ కింద వచ్చే ఆదాయాన్ని.. మీకు అర్హత ఉంటే మీ ఖాతాలో వేస్తామని, ఆ తర్వాత మీరు నగదు ఇవ్వాలని.. దీనికి కూడా 30 శాతం కమీషన్ ఉంటుందని కూడా మార్కెట్లో ప్రచారం అవుతుంది.
ఇలా మార్కెట్లో బాగా ప్రచారం అవుతుండటంతో చాలా మంది.. భారీగా కరెంట్ అకౌంట్లో నగదును నిల్వ ఉంచుకునే వ్యాపారి ఉంటే చెప్పండి.. మీకు భారీగా కమీషన్ అంటూ చాలా మంది చక్కర్లు కొడుతున్నారు. ఈ ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ మీటింగ్లో ఫెయిల్ అయితే రూ.15 లక్షలు చెల్లించుకోవాలనే నిబంధనను కూడా పెట్టుకుని.. ఇదంతా చట్ట బద్ధమేనని మోసగాళ్లు నమ్మిస్తునారు.
మురళీ కృష్ణ 10వ తరగతి వరకు చదివి.. ఆ తర్వాత విజయవాడలో రంగురాళ్లు విక్రయించేందుకు భక్తినిధి వెబ్సైట్ను నిర్వహించాడు. అదే విధంగా పలు టీవీ చానళ్లలో రంగురాళ్లతో పాటు జ్యోతిష్యం చెబుతూ షోలను ఇచ్చాడు. ఇలా అతనికి నూరుద్దీన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను ట్రేడ్ ప్రాఫిట్ గురించి చెప్పి భారీగా నగదును బ్లాక్లో కావాలని తెలిపాడు. దీని కోసం డ్రీమ్ వ్యాలీ మినిస్ట్రీస్కు చెందిన హెలీ విపూరిని పరిచయం చేశాడు. దీంతో వారి మధ్య కుదిరిన ఒప్పందానికి మురళీకృష్ణ శర్మ భారీగా బొమ్మ కరెన్సీ కొనుగోలు చేసి.. వాటిపైన అసలు నగదు పెట్టి మాయ చేశాడు.
ఈ నగదును చూసిన హెలీ విపూరి మంగళగిరి ఐఓబీ బ్యాంక్ అధికారులతో మాట్లాడి మురళీకృష్ణ ఖాతాలో రూ.90 కోట్లు జమచేయించాడు. ఈ నగదును మురళీ కృష్ణ తన వ్యక్తిగత ఖాతాలోకి మార్చుకున్నాడు. ఈ వ్యవహారంపై అనుమానం రావడంతో బ్యాంక్ అధికారులు సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ.. మురళీకృష్ణతో పాటు మరికొంత మందిని అరెస్ట్ చేసింది.
బెయిల్పై వచ్చిన మురళీ కృష్ణ నగరానికి వచ్చి బొమ్మ కరెన్సీని అసలు నోట్లుగా చూపించి.. ట్రేడ్ ప్రాఫిట్ దందా అంటూ మోసాలకు పాల్పడి రూ.33 లక్షలు కొట్టేశాడని తెలిసింది. ఇలా కొట్టేసిన నగదుతో మురళీ కృష్ణ ప్రతి రోజు ఓ కాల్గర్ల్తో జల్సా చేసేవాడని పోలీసులకు ఆధారాలు దొరికాయి. వేగంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉన్న యువకులు ఇలాంటి మోసాల బారిన పడి సమయం, డబ్బును వృథా చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.