చార్మినార్, డిసెంబర్ 23 : నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలను తయారీ చేసి, అవసరమైన వ్యక్తులకు విక్రయిస్తున్న నలుగురు సభ్యులున్న ముఠాను దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 243 నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు, తంబ్ స్కానర్, సీపీయూ, మొనిటర్, ప్రింటర్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ, టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ సాయి చైతన్య, గుమ్మీ చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ముఠా సభ్యుల్లోని ప్రధాన నిందితుడు మహ్మద్ ఇబ్రహీం (45)కు తలాబ్కట్ట ప్రాంతంలో ఐఏ ఖిద్మతే పేరుతో మీ సేవా కేంద్రం ఉంది. మీ సేవా కేంద్రానికి జనన ధ్రువీకరణ పత్రాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు చాలా మంది వస్తున్నారు. సరైన ఆధారాలు, పత్రాలు లేకపోవడంతో సర్టిఫికెట్లు పొందలేకపోతున్నారు. ప్రజల అవసరాలను పసిగట్టిన ఇబ్రహీం.. జనన ధ్రువీకరణ పత్రాలు, అవసరమైన డాక్యుమెంట్లు తయారు చేసి ఇవ్వాలని పథకం వేశాడు.
ఇందుకు రాజేంద్రనగర్లో ఆన్లైన్ సెంటర్ను నిర్వహిస్తున్న షేక్ అమీర్ (29), కాలాపత్తర్లో ఆన్లైన్ సెంటర్ను నిర్వహిస్తున్న ఎండీ షహబాజ్ (19), కామాటీపురలో ఆన్లైన్ సెంటర్ను నిర్వహిస్తున్న మహ్మద్ షానవాజ్ను తోడు చేసుకున్నాడు. ఈ నలుగురు సభ్యులు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. జనన ధ్రువీకరణ పత్రాల కోసం జీహెచ్ఎంసీలో దరఖాస్తు చేసుకునేందుకు అసరమయ్యే పత్రాల వివరాలను సేకరించారు. ఈ ముఠా సభ్యులు నిర్వహిస్తున్న కేంద్రాలకు జనన ధ్రువీకరణ పత్రాల కోసం వస్తున్న ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దరఖాస్తుకు అవసరమయ్యే పత్రాల్లో ఏవైనా దరఖాస్తుదారు వద్ద లేకుంటే.. నిందితులు తయారు చేసి ఆయా పత్రాలను సమకూరుస్తున్నారు. కొన్ని సందర్భాల్లో జీహెచ్ఎంసీ జారీ చేయాల్సిన నాన్ అవలెబుల్ సర్టిఫికెట్ను కూడా నిందితులే తయారు చేసి జారీ చేస్తున్నారు. ఒక్కొక్క జనన ధ్రువీకరణ పత్రానికి రూ.2వేలు వరకు వసూలు చేస్తున్నారు.
గత జూన్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 3వేలకు పైగా జనన ధ్రువీకరణ పత్రాలను వీరి వద్దకు వచ్చిన అమాయక ప్రజలను నమ్మించి విక్రయించారు. ఈ ముఠా నుంచి తీసుకున్న జనన ధ్రువీకరణ పత్రాలు చలామణి కాకపోవడం, నకిలీవని తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆన్లైన్ సేవా కేంద్రాలపై దాడిచేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో మోసాల చిట్టా బయటపడింది.
బ్రోకర్లను ఆశ్రయించ వద్దు: డీసీపీ
శిశువు జనన ధ్రువీకరణ పత్రాలు లేనివారు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నుంచి నాన్ అవెలబిలిటీ సర్టిఫికెట్ను ముందుగా పొందాలని డీసీపీ సాయి చైతన్య తెలిపారు. జనన ధ్రువీకరణ పత్రం రిజిస్ట్రేషన్ కోసం స్సెషల్ మెజిస్ట్రేట్ జారీ చేసిన సర్టిఫెకెట్ను మీ సేవా కేంద్రాల్లో అందించాలన్నారు. వాటిని జీహెచ్ఎంసీలోని ఏఎంహెచ్ఓ ధ్రువీకరిస్తారని పేర్కొన్నారు. అప్పుడు దరఖాస్తుదారుకు జీహెచ్ఎంసీ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం చెల్లుబాటవుతుందన్నారు. బ్రోకర్లను ఆశ్రయించి మోసపోవద్దని డీసీపీ సూచించారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్, మొఘల్పుర ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, శివకుమార్, ఎస్సైలు నరేందర్, శ్రీశైలం, షేక్ బురాన్, కె.నర్సింలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.