అంబర్పేట, జనవరి 14 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమ నిర్వహణకు అంబర్పేట నియోజకవర్గంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు ను నిర్వహించేందుకు నియోజకవర్గంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట డివిజన్ల పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలకు అందుబాటులో పరీక్షలు నిర్వహించేందుకు కమ్యూనిటీహాళ్లలో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
చిన్నాపెద్దా అనే తేడా లేకుండా కంటి సమస్యలు ఉన్నవారందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి కండ్ల అద్దాలు ఉచితంగా అందించనున్నారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు కూడా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. నియోజకవర్గంలో సుమారు నాలుగున్నర లక్షల జనాభా నివాసం ఉంటుందని అంచనా వేసిన అధికారులు అవసరమైన వారందరికీ పరీక్షలు చేసేలా 100 రోజుల పాటు కేంద్రాలను అందుబాటులో ఉంచనున్నారు.
ఒక్కో కేంద్రంలో ఉడయం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు రోజులకు 400 మందికి కంటి పరీక్షలు నిర్వహించేలా సిబ్బందిని నియమించడంతో పాటు వైద్య పరికరాలు సిద్ధం చేశారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో అవసరమైన వారికి పంపిణీ చేసేందుకు కళ్లద్దాలను సిద్ధం చేస్తున్నారు. అంబర్పేట నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులతో వైద్య శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు.
సర్కిల్ పరిధిలో కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భవనాలను గుర్తించారు. జీహెచ్ఎంసీ వార్డు పరిధిలో అన్ని బస్తీలు, కాలనీలలో ప్రజలకు అందుబాటులోకి కేంద్రాలు మర్చుకునే వెసులుబాటు కల్పించారు. సమీపంలోనే పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో ఆయా ప్రాంతాల్లోకి కేంద్రాలు మార్చుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బందితో డీసీ వేణుగోపాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
కంటి వెలుగు నిర్వహించే కేంద్రాలు
1. అంబర్పేట .. ఎంసీహెచ్ ఇండోర్ స్టేడియం
2. అంబర్పేట .. పటేల్బాడా
3. గోల్నాక .. కమలానగర్ కమ్యూనిటీహాల్
4. గోల్నాక .. నెహ్రూనగర్ కమ్యూనిటీహాల్
5. నల్లకుంట .. టీఆర్టీ క్వార్టర్స్ కమ్యూనిటీహాల్
6. బాగ్అంబర్పేట.. రామకృష్ణనగర్ కమ్యూనిటీహాల్
7. కాచిగూడ .. విక్రమ్నగర్ కమ్యూనిటీహాల్
8. కాచిగూడ .. వీరన్నగుట్ట కమ్యూనిటీహాల్
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి
ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపపడుతున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. కంటి సమస్య ఉన్న వారంతా కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు చేయించుకొని ప్రయోజనం పొందాలి. అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వడంతో పాటు ఇంకా అవసరమైన వారికి కంటి ఆపరేషన్ కూడా చేస్తారు.
-కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్యే అంబర్పేట