సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం 108 అంబులెన్స్ వాహనాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏఈడీ(ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్) యంత్రాలు, వెంటిలేటర్ సపోర్ట్తో కూడిన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్(ఏఎల్ఎస్) సిస్టమ్ గుండెపోటు బాధితులకు వరంగా మారాయి. కార్డియాక్ అరెస్ట్కు గురైన రోగులకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించేందుకు 108అంబులెన్స్లో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ఎంతో మంది రోగుల ప్రాణాలకు భరోసా కల్పిస్తోంది. సాధారణంగా గుండెపోటు బాధితులను ‘గోల్డెన్ హవర్’లో దవాఖానకు చేర్చి, వెంటనే అవసరమైన చికిత్స అందించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం నగరంలో నెలకొన్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోగిని సాధారణ అంబులెన్స్లో దవాఖానకు తరలించేలోపు సమయం మించిపోయి ప్రాణాలు పోతున్నాయి. దీనిని అధిగమించి, రోగుల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్(ఏఎల్ఎస్) వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గతంలో 108 అంబులెన్స్లో బేసిక్ లైఫ్ సపోర్ట్ వ్యవస్థ మాత్రమే ఉండేదని, ప్రస్తుతం నగరంలోని దాదాపు అన్ని వాహనాల్లో ఏఎల్ఎస్ వ్యవస్థ ఉండటంతో గుండెపోటు రోగులను ఘటనా స్థలి నుంచి దవాఖానకు చేర్చే వరకు అత్యవసర చికిత్సను ఇవ్వడం వల్ల ప్రాణపాయ స్థితి నుంచి బయట పడుతున్నట్లు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర దవాఖానలకు చెందిన గుండె వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
6 అంబులెన్సుల్లో ఏఎల్ఎస్..
నగరంలో మొత్తం 25 అంబులెన్స్(108)లు ఉన్నాయి. అందులో 19వాహనాలు బీఎల్ఎస్ అంటే (బేసిక్ లైఫ్ సపోర్ట్). కాగా మిగిలిన 6 వాహనాలు ఏఎల్ఎస్ వాహనాలు. వీటిలో ముఖ్యంగా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ తదితర రోగులకు అత్యవసర సేవలు అందించేందుకు గాను ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్'(ఏఈడీ), వెంటిలేటర్, ఆక్సీజన్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. రోగి ఆరోగ్య సమస్య ఆధారంగా అవసరమైన అంబులెన్స్ వాహనాన్ని పంపిస్తామని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సీహెచ్.నరేందర్రెడ్డి తెలిపారు.
ఏఈడీ పనిచేస్తుందిలా?
అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వ్యవస్థ ఉన్న 108అంబులెన్స్ వాహనంలో ఆటోమెటడ్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్ పరికరం అందుబాటులో ఉంటుంది. ఎవరైనా రోగి గుండెపోటుకు గురైనట్లు సమాచారం వస్తే వెంటనే 108 సిబ్బంది రోగి వద్దకు చేరుకుంటారు. సాధారణంగా కార్డియాక్ అరెస్ట్ రోగుల్లో గుండె హఠాత్తుగా ఆగిపోతుంది. అలా జరుగకుండా ఉండేందుకు ‘డెఫిబ్రిలేటర్’ యంత్రం ద్వారా రోగి గుండెకు కరెంటు షాక్ ఇచ్చి, కార్డియాక్ పల్మనరీ, రీ-సక్టిటేషన్ ద్వారా రోగి గుండె తిరిగి పనిచేసేలా చికిత్స అందిస్తారు. అనంతరం రోగిని దగ్గరలో ఉన్న దవాఖానకు తరలిస్తారు.
నగరంలోనే 3వేల మందికి సేవలు
రాష్ట్ర వ్యాప్తంగా 400కు పైగా 108అంబులెన్స్ వాహనాలు ఉన్నాయి. అందులో ఒక హైదరాబాద్ నగరంలోనే 25 అంబులెన్స్లు ప్రతినిత్యం అత్యవసర సేవలు అందిస్తున్నాయి. ప్రతి నెల దాదాపు 3వేల నుంచి 3500 కేసులను 108సిబ్బంది అటెండ్ చేస్తున్నారు. వీటిలో దాదాపు 500 వరకు చాతి నొప్పికి సంబంధించిన కేసులు ఉండగా అందులో 150 నుంచి 200 వరకు కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు కేసులు ఉంటాయి. వీరందరిని ఏఎల్ఎస్ వాహనాల్లోనే రోగి కుటుంబ సభ్యుల సూచన మేరకు ఆయా దవాఖానలకు తరలిస్తున్నారు. 150 నుంచి 200 కార్డియాక్ అరెస్ట్ కేసుల్లో కనీసం 10 నుంచి 15 కేసులకు 108 సిబ్బంది ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్ ద్వారా అత్యవసర చికిత్స అందిస్తున్నారు. దీని వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడగలుగుతున్నాం.
– సీహెచ్.నరేందర్రెడ్డి, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్, (హైదరాబాద్, రంగారెడ్డి)