సికింద్రాబాద్ : సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కంటోన్మెంట్లోని పికెట్ నాలుగోవార్డులో బోర్డు మాజీ సభ్యురాలు నళినికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు.
అదే విధంగా మారేడ్పల్లి మల్లీపర్పస్ ఫంక్షన్హాల్లో తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డిలు ప్రారంభించారు.
దీంతో పాటు తిరుమలగిరి లాల్బజార్లో ఆర్యవైశ్య భవన్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ప్రారంభించారు. ఆదే విధంగా కంటోన్మెంట్లోని అంబేద్కర్ నగర్లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సాయన్న సందర్శించారు.
కారణ జన్ముడు సీఎం కేసీఆర్..
తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తదేక దీక్షతో తన శక్తియుక్తులన్నీ ధారపోసి రాష్టాన్ని సాధించిన కేసీఆర్, ‘తెలంగాణ గాంధీ’గా ప్రజలందరి నుంచి మన్నన్నలు అందకుంటున్నారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు.
ఈ క్రమంలో సీఎం కేసీర్ జన్మదిన వేడుకల్లో భాగంగా సీతాలఫల్మండి డివిజన్లోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో స్థానిక కార్పొరేటర్ సామల హేమ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డిలతో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రాన్ని ప్రజందరి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు తపిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, నేతలు కిషోర్కుమార్, చంద్రశేఖర్తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఓయూలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాదరి కిషోర్
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యునివర్సిటీలో టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్, రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మేకల రవి ఆధ్వర్యంలోనిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కలకాలం బాగుండాలని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తున్న తెలంగాణ జాతిపిత నిండునూరేళ్లూ ఆయూరారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు ధర్మేందర్రెడ్డి, కృష్ణ, సురేష్, వీరబాబు, సతీష్, కిరణ్గౌడ్, కడారి స్వామి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల హృదయాల్లో సీఎం కేసీఆర్..
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్థాయిలో ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ అన్నారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ పరిధిలోని మారేడ్పల్లిలో రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సాయన్న, మరి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డిలతో కలిసి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అనేక రంగాల్లో పురోగాభివృద్ధి సాధిస్తుందన్నారు. అనేక సంక్షేమ పథకాల అమలుతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిపారని గుర్తు చేశారు.