సిటీబ్యూరో, మార్చి 11(నమస్తే తెలంగాణ): మూసీ నది సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అగ్రిగేట్ మాస్టర్ప్లాన్ను రూపొందిస్తున్నది. ఈ మాస్టర్ప్లాన్లో నది మొత్తం విస్తీర్ణం, దాని పరిసర ప్రభావ ప్రాంతాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఉస్మాన్సాగర్(గండిపేట) జలాశయం దిగువ భాగం నుంచి మొదలై నగరానికి తూర్పు దిక్కున ఉన్న గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగు రోడ్డు సరిహద్దు వరకు, అదేవిధంగా మరో జలాశయమైన హిమాయత్సాగర్ దిగువ ప్రాంతం నుంచి బాపుఘాట్ వద్ద మూసీ, ఈసీ నదుల సంగమం వరకు కలిపి మొత్తం 59 కి.మీ మేర ఉన్న నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి అగ్రిగేట్ మాస్టర్ప్లాన్ను రూపొందించనున్నారు. ఈ మేరకు కన్సల్టెన్సీల ఎంపికకు టెండర్లు పిలిచారు. దీని గడువు ఈ నెల 7 వరకు ఉండగా, 14వ తేదీకి పొడిగించారు. మూసీ నది తీర ప్రాంత అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి అనేక సార్లు సమీక్ష చేశారు. ఈ నేపథ్యంలోనే టెండర్లలో పలు మార్పులు చేసి… మళ్లీ గడువును పెంచారు. మూసీ పరిరక్షణ కోసం రూపొందించే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్లో 5 అంశాలకు ప్రాధ్యానం ఇస్తున్నారు. ఇందులో బ్లూ మాస్టర్ ప్లాన్, మార్కెట్ ఫెసిబిలిటీ స్టడీ, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్లు ఉంటాయి.
గత నెలలో ప్రభుత్వం గత నెలలో సిమ్యులేషన్ ఫర్ హైడ్రాలిక్స్ పేరుతో రూపొందించే ప్రాజెక్టుకు కన్సల్టెన్సీల ఎంపికకు టెండర్ను పిలిచింది. మొత్తం 8 మంది కన్సల్టెన్సీలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఈ జాబితాలో ఆర్వీ అసోసియేటెడ్ ఆర్కిటెక్ట్ ఇంజినీర్స్ అండ్ కన్సల్టెంట్స్, సెకాన్ ప్రైవేట్ లిమిటెడ్, వ్యాప్కోస్ లిమిటెడ్, వోయాంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రాక్టెబెల్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఎస్ఎస్ అసోసియేట్స్ కన్సల్టింగ్ ఇంజినీర్స్, షా టెక్నికల్ కన్సల్టెంట్స్, ఎన్కె బిల్డ్కాన్ ప్రైవేట్ లిమిటెడ్లు ఉన్నాయి. కాగా, ఒకేసారి మూసీ నది తీర ప్రాంత అభివృద్ధికి సంబంధించి రకరకాల ప్రణాళికలను రూపొందిస్తూ.. క్షేత్ర స్థాయిలో మూసీ సరిహద్దులను నిర్ణయించేందుకు అధికారులు జియోగ్రాఫికల్ సర్వేను నిర్వహిస్తున్నారు.